అనకాపల్లి జిల్లా : ఎన్డీఏ ప్రభుత్వం గంజాయి డ్రగ్స్ పై ఉక్కు పాదం మోపిందన్నారు ఏపీ రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత. సీఎం చంద్రబాబు ఆదేశాలతో ఈగల్ వ్యవస్థను కూడా ఏర్పాటు చేశామన్నారు. శుక్రవారం ఆమె మీడియాతో మాట్లాడారు. విశాఖపట్నం రేంజ్ పరిధిలోని 5 జిల్లాల్లో పట్టుబడిన సుమారు 20,876 కేజీల గంజాయిని, 23 కేజీల హాశిష్ ఆయిల్ ను పరవాడ పరిధిలోని కోస్టల్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్లో ధ్వంసం చేశారు. 490 కేసుల్లో పట్టుబడింది గంజాయి ధ్వంసం చేశారన్నారు. ఇందులో పాల్గొన్నారు హోంమంత్రి వంగలపూడి అనిత, IG గోపీనాథ్ జట్టి, అనకాపల్లి ఎస్పీ తుహిన్ సిన్హా, ఇతర సీనియర్ పోలీస్ అధికారులు. అనకాపల్లి జిల్లాలో గంజాయి సాగును పూర్తి అరికట్టామన్నారు.
గత 18 నెలల కాలంలో ఐదు సార్లు గంజాయి ధ్వంసం చేశామని తెలిపారు వంగలపూడి అనిత. గంజాయి బారిన పడకుండా యువతను రక్షించుకోవడమే మా ధ్యేయం అని స్పష్టం చేశారు. ఈరోజు 20 వేల కేజీల పైగా గంజాయిని ధ్వంసం చేశామన్నారు. రెండు రోజుల క్రితం అంతర్జాతీయ దొంగను పోలీసులు అరెస్టు చేశారని చెప్పారు. విశాఖ రేంజ్ పరిధిలో ఉన్న ఎస్పీలు సమన్వయంతో పని చేస్తున్నారని ప్రశంసలు కురిపించారు హోం శాఖ మంత్రి. ఇదిలా ఉండగా గిరిజనులు ప్రత్యామ్నాయ పంటలు పండిస్తున్నారని చెప్పారు. పోలీసులు ప్రత్యామ్నాయ పంటలపై అవగాహన కల్పిస్తున్నారని తెలిపారు వంగలపూడి అనిత. ఒరిస్సా నుండి ఇతర రాష్ట్రాలకు గంజాయి ఎక్కువగా రవాణా జరుగుతోందన్నారు.
మన ఈగల్ టీం సూచనలు,సలహాలు ఒరిస్సా పోలీసులు స్వీకరిస్తున్నారని చెప్పారు. ఇప్పుడు పెద్ద సంఖ్యలో సీసీటీవీ కెమెరాలతో పాటు, చెక్ పోస్టులు కూడా ఏర్పాటు చేశామన్నారు. గంజాయి ఖైదీలు జైలులో ఎక్కువగా ఉంటున్నారని తెలిపారు. గంజాయి కేసుల్లో విచారణ వేగవంతంగా చేస్తున్నామని చెప్పారు వంగలపూడి అనిత. ఎస్పీలు వివిధ వినూత్న కార్యక్రమాలతో ప్రజలకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పిస్తున్నారని తెలిపారు. అభ్యుదయ సైకిల్ యాత్ర పేరుతో 53 రోజులు సైకిల్ యాత్ర చేశారని అన్నారు.చైతన్యం, సంకల్పం పేర్లతో గంజాయి, డ్రగ్స్ పై యుద్ధమే ప్రకటించాం అన్నారు. పూర్తి స్థాయిలో టెక్నాలజీని వాడుతున్నామన్నారు. జాతీయ, అంతర్జాతీయ ముఠాలను కూడా పట్టుకుంటున్నామని అన్నారు. గంజాయి, డ్రగ్స్ నిర్మూలనపై పోలీసులు అద్భుతంగా పని చేస్తున్నారని కితాబు ఇచ్చారు.
