హైదరాబాద్ : అధికారులు తాము ప్రజలకు జవాబుదారీగా ఉంటామనే విషయాన్ని ఎన్నడూ మర్చిపోకూడదని అన్నారు రాష్ట్ర ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ డాక్టర్ జి. చిన్నారెడ్డి. ప్రజా సమస్యలను పరిష్కరించడమే ప్రాథమిక లక్ష్యంగా అంకితభావంతో, బలమైన బాధ్యతా స్ఫూర్తితో తమ విధులను నిర్వర్తించాలన్నారు. ప్రజావాణి కార్యక్రమానికి మండల నోడల్ అధికారులుగా నియమితులైన 560 మంది మండల పరిషత్ అభివృద్ధి అధికారుల (ఎంపీడీఓల) కోసం మహాత్మా జ్యోతిబా ఫూలే ప్రజా భవన్లో నిర్వహించిన శిక్షణా కార్యక్రమంలో ప్రసంగించారు. తమ సమస్యలకు పరిష్కారం కోరుతూ ప్రజావాణిని ఆశ్రయించే ప్రజల సమస్యలను పరిష్కరించడంలో మండల నోడల్ అధికారులు, మండల స్థాయిలోని వివిధ శాఖల అధికారులకు కీలక బాధ్యత ఉందని అన్నారు.
గ్రామాల నుండి వచ్చే పౌరులతో అధికారులు ఓపికగా మాట్లాడాలని, వారి సమస్యలను శ్రద్ధగా వినాలని, వారి దరఖాస్తులను స్వీకరించాలని, సమస్యలను పెండింగ్లో ఉంచకుండా క్షేత్రస్థాయిలోనే వాటిని పరిష్కరించడానికి సాధ్యమైన అన్ని ప్రయత్నాలు చేయాలని ఆయన అన్నారు. ప్రజలే యజమానులు అని, వారికి సేవ చేయడమే ప్రతి ప్రభుత్వ అధికారి ప్రాథమిక బాధ్యత అని డాక్టర్ చిన్నారెడ్డి గుర్తు చేశారు. పరిపాలన ప్రజలకు అందుబాటులో ఉండాలని, వారి నిజమైన అవసరాలకు స్పందించాలని ఆయన నొక్కి చెప్పారు. మండల ప్రజావాణి కోసం నోడల్ అధికారులుగా సేవలందించే ముఖ్యమైన బాధ్యతను అప్పగించిన ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని డాక్టర్ చిన్నారెడ్డి ఎంపీడీఓలకు పిలుపునిచ్చారు.
ప్రజల సమస్యలను పరిష్కరించడానికి, పౌరుల ప్రశంసలు, నమ్మకాన్ని సంపాదించడానికి ప్రజావాణి వేదికను సమర్థవంతంగా ఉపయోగించు కోవాలని ఆయన కోరారు. నిజమైన సమస్యలతో ప్రభుత్వాన్ని ఆశ్రయించే వారికి తగిన సహాయం, ఉపశమనం అందేలా చూస్తూ పేద, నిరుపేద ప్రజల సమస్యలను పరిష్కరించడానికి ప్రజావాణి ఒక సమర్థవంతమైన వేదికగా మారాలని ఆయన అన్నారు. రాష్ట్ర స్థాయిలో నిర్వహించిన ముఖ్యమంత్రి ప్రజావాణి కార్యక్రమం సమస్యల పరిష్కారంలో 75 శాతం విజయం సాధించిందని డాక్టర్ చిన్నారెడ్డి పేర్కొన్నారు. జిల్లా, మండల స్థాయిలలో ప్రజావణి బాధ్యతగల అధికారులు అదే నిబద్ధతతో పనిచేయాలని, తమ ముందుకు వచ్చిన సమస్యలను పరిష్కరించడంలో సమర్థవంతమైన ఫలితాలను సాధించడానికి కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
