అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కూటమి సర్కార్ బీసీలకు సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్. సవిత. స్థానిక సంస్థల్లో బీసీలకు మొట్ట మొదటి సారిగా దివంగత ముఖ్యమంత్రి అన్న ఎన్టీఆర్ 27 శాతం మేర రిజర్వేషన్లు కల్పించారని మంత్రి గుర్తు చేశారు. ఆయన స్ఫూర్తితో పాలన సాగిస్తున్న సీఎం చంద్రబాబు నాయుడు బీసీ రిజర్వేషన్లను 34 శాతానికి పెంచారన్నారు. 2013లో జరిగిన ఎన్నికల్లో ఆ రిజర్వేషన్లతోనే స్థానిక సంస్థల ఎన్నికలు జరిగాయన్నారు. 2021లో బీసీ రిజర్వేషన్లను జగన్ 24 శాతానికి కుదించారన్నారు. దీనివల్ల బీసీలకు 16,800 పదవులకు దూరమయ్యారన్నారు. బీసీల సంక్షేమం కోరే సీఎం చంద్రబాబు నాయుడు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో 34 శాతం రిజర్వేషన్ల అమలు చేయాలని నిర్ణయించారన్నారు ఎస్. సవిత. ఎన్ని అడ్డంకులు ఎదురైనా బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు అమలు చేసి తీరుతామన్నారు.
ఇదే సమయంలో గత పాలనలో రాష్ట్రాన్ని అన్ని రంగాలలో సర్వ నాశనం చేసిన ఘనత మాజీ సీఎం జగన్ రెడ్డికి దక్కుతుందని సంచలన ఆరోపణలు చేశారు మంత్రి ఎస్. సవిత. జగన్ అవినీతి, అక్రమార్జనకు వైసీపీకి చెందిన బీసీ నాయకులు బలైపోతున్నారని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. బీసీ నాయకులకు పదవులు ఆశ చూపి, వారిని అక్రమ మద్యం తయారీ, మద్యం రవాణా, ఇసుక అక్రమ తవ్వకాలు ఇలాంటి కేసులలో ఇరికించారని, ఇందు కోసం వారిని పావులుగా చేశారన్నారని ఆరోపించారు. జగన్ ధన దాహానికి ఆయా కేసుల్లో బీసీలు ఇరుక్కోవడం బాధాకరమని మంత్రి సవిత అన్నారు. బీసీల మేలు కోరే సీఎం చంద్రబాబు నాయుడు వారి రక్షణ కోసం బీసీ రక్షణ చట్టం తీసుకొస్తున్నారని వెల్లడించారు. బీసీల అభ్యున్నతి కోసం తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని మరోసారి స్పష్టం చేశారు ఎస్. సవిత.
