ఉత్తరాంధ్రకు గోదావరి జలాలు ఆగనున్న వలసలు
2.87 లక్షల ఎకరాలకు సాగు నీరు, 9 లక్షల మందికి తాగునీరు
అనకాపల్లి : పోలవరం ఎడమ ప్రధాన కాలువ ద్వారా గోదావరి జలాలు ఉత్తరాంధ్రలోకి అడుగు పెట్టాయి. పాయకరావుపేట వద్ద క్రాస్ రెగ్యులేటర్ నుంచి ప్రవహించిన గోదారమ్మకు జనం నీరాజనాలు పలికారు. అనకాపల్లికి గోదారమ్మ తరలి వచ్చిన భావోద్వేగ వాతావరణం మధ్య పోలవరం ఎడమ కాలువలో నిల్చుని గోదావరి జలాలకు పుష్పాలు, పసుపు కుంకుమ సమర్పించారు. ప్రస్తుతం ఎడమ కాలువ ద్వారా విడుదల చేసిన నీటితో తూర్పుగోదావరి, కాకినాడ, కోనసీమ, అనకాపల్లి జిల్లాల్లోని 2.87 లక్షల ఎకరాలకు సాగునీరు, 9.23 లక్షల మందికి తాగునీరు ఇచ్చేలా ప్రభుత్వం ప్రణాళిక చేసింది. తాండవ, వరహా, శారదా నదులతో పాటు ఏలేరు కాలువ లపై సైఫన్లు, ఆక్విడెక్టులను నిర్మించింది. ఎడమ కాలువ కోసం ఇప్పటి వరకూ రూ.4192 కోట్లను ప్రభుత్వం వ్యయం చేసింది. ఎడమ కాలువ ద్వారా వచ్చిన నీటితో అనకాపల్లి వద్ద ఏలేరు కాలువతో పాటు జిల్లాలోని 110 చెరువులను నింపేలా జల వనరుల శాఖ ప్రణాళిక చేసింది. గోదావరి జలాలతో పుష్కర ఆయకట్టు పరిధిలో 1.48 లక్షల ఎకరాలు, ఏలేరు కింద 80 వేల ఎకరాలు, పంపా కింద 12 వేల ఎకరాలు, తాండవ, వరహా, మామిడి గెడ్డ ఆయకట్టు పరిధిలో ఉన్న 46,620 ఎకరాల స్థిరీకరణ జరుగనుంది. దీంతో పాటు విశాఖ, అనకాపల్లి జిల్లాల్లోని పారిశ్రామిక అవసరాలకు, తాగు, సాగునీటి అవసరాల కోసం 23.44 టీఎంసీల నీటిని తరలించేలా ప్రణాళిక చేపట్టారు.
ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్లు రావడంతో ఈ ప్రాంతాలన్నీ కళ కళ లాడుతున్నాయి. ఇక ఈ ప్రాంతంలోని బీళ్లన్నీ పంటలు పండుతాయి. అనకాపల్లి జిల్లాలో అడుగుపెట్టి ఉత్తరాంధ్రకు తరలి వచ్చిన గోదారమ్మకు ప్రణమిల్లుతున్నానని జనం. గోదావరి మూడు పాయలు గౌతమి, వశిష్ఠ, వైనతేయ సముద్రంలో కలుస్తుంటే..ఇప్పుడు పోలవరం ఎడమ కాలువ ద్వారా అనకాపల్లికి గోదావరి తరలి రావడంతో ఉబ్బితబ్బిబ్బవుతున్నారు. తూర్పు కనుమలు, అడవులు, నదులు, వాగులు, వంకలు, హైవేలను దాటుకుని అన్నవరం సత్య దేవుడి ఆశీస్సుల కోసం గోదారమ్మ ఇక్కడకు వచ్చిందని అంటున్నారు. వచ్చే ఏడాదికి సింహాచలం అప్పన్న చెంతకు గోదావరి జలాలను తీసుకువెళతామని ఆపై అరసవల్లి సూర్యనారాయణ స్వామి వద్దకు తరలించి వంశధార వరకూ గోదావరిని జలాలను తరలిస్తామని చెప్పారు సీఎం. పోలవరం ఎడమ కాలువ ద్వారా తూర్పుగోదావరి, కోనసీమ, కాకినాడ, అనకాపల్లి జిల్లాల్లో సాగు, తాగునీటి అవసరాలు తీర్చేలా ప్రణాళిక రూపొందించారు.
తొలి దశలో 2.87 లక్షల ఎకరాలకు సాగునీరు, 9 లక్షల మందికి తాగునీరు అందేలా చర్యలు చేపట్టారు. పోలవరం ఎడమ కాలువ నిర్మాణానికి ఇప్పటివరకు రూ.4,192 కోట్లు ఖర్చు చేశారు. మరో రూ.800 కోట్లు ఖర్చు చేసి మొత్తం పనులు పూర్తి చేయనున్నారు. ఏలేరు కాలువపై సైఫన్, పంపా, తాండవ, వరాహ నదులపై ఆక్విడెక్టులు నిర్మించి కాలువ పనులు పూర్తి చేసింది సర్కార్. తాళ్లపాలెంలో భూ వివాదాన్ని పరిష్కరించి నిర్వాసితులకు పునరావాసం కల్పించారు.. లెఫ్ట్ కెనాల్లో ప్రవహిస్తున్న ప్రతి నీటి చుక్క వెనుక ఇంజినీర్ల ప్రతిభ, కార్మికుల కష్టం, రైతుల నిరీక్షణ, నిర్వాసితుల త్యాగం, ప్రభుత్వ సమర్థత ఉన్నాయని పేర్కొన్నారు సీఎం.
