Bharath Bhushan : తెలంగాణ మరో అరుదైన కళాకారుడిని కోల్పోయింది. కొన్ని గంటల తేడాలో ఇద్దరు దిగ్గజాలు లేక పోవడం బాధాకరం. కవి, రచయిత ఎండ్లూ సుధాకర్ మరణం నుంచి కోలుకోక ముందే విషాద వార్త వినాల్సి వచ్చింది.
తెలంగాణ అస్తిత్వాన్ని, బతుకుని తన ఫోటోలలో బంధించిన ఏకైక సృజనకారుడు, ఫోటోగ్రాఫర్ భరత్ భూషణ్ (Bharath Bhushan)కన్నుమూశారు. తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్న ఇవాళ తుది శ్వాస విడిచారని కుటుంబీకులు తెలిపారు.
సామాజిక స్పృహ కలిగిన వ్యక్తిగా ఆయన పేరొందారు. బాధ్యత కలిగిన తెలంగాణ ప్రాంతానికి చెందిన బిడ్డగా చివరి దాకా తన విధిని నిర్వర్తించాడు భరత్ భూషణ్.
ఆయన వేసిన చిత్రాలే కాదు తీసిన ఫోటోలు తెలుగు రాష్ట్రాలలోనే కాదు ప్రపంచాన్ని సైతం విస్మయ పరిచేలా చేసింది. ఒక రకంగా పల్లె తనం, మట్టి తనం కలబోసుకున్న కళాకారుడు భరత్ భూషణ్(Bharath Bhushan).
ఏ ఫోటోకైనా శీర్షిక లేకుండానే అర్థం చేసుకునేలా తీసిన గొప్ప నేర్పరి ఆయన. ఆయన ఇల్లంతా ఫోటోలు, అద్భుత చిత్రాలతో నిండి ఉంటుంది. ఒక కళాకారుడిగా ఇది తెలంగాణకు తీరని దుఖఃం.
కోట్లాది తెలంగాణ వాసుల బతుకుని, నడవడికను, వారి ఆనందాలను, పల్లె తనపు సంస్కృతిని ప్రతిబింబించేలా చేసిన తీరు ఆద్యంతమూ ప్రశంసనీయం.
ఆయన భౌతికంగా లేక పోవడం మాత్రం తీరని విషాదం. 1970లో ఫోటోగ్రాఫర్ గా తన కెరీర్ స్టార్ట్ చేశారు. ఆనాటి నుంచి నేటి దాకా ఫోటోలు తీస్తూ గడిపాడు.
పలు ఇంగ్లీష్, తెలుగు పత్రికలలో ఫోటోగ్రాఫర్ గా కూడా పని చేశారు భరత్ భూషణ్. ఆయన మరణం పట్ల సీఎం కేసీఆర్ తో పాటు కవులు, కళాకారులు, సాహితీవేత్తలు, రచయితలు, గాయనీ గాయకులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.
Also Read : శ్రీధర్ బెవరా పుస్తకానికి అరుదైన గౌరవం