అమరావతి : గాలిలో మేడలు కట్టొద్దు అని హితవు చెప్పే పెద్దలు నేలపై నిలబడమంటారు. సవాళ్లతో కూడిన విద్యా శాఖను చేపట్టిన నారా లోకేష్ గాలిలో మేడలు కట్టే యంత్రాంగానికి అసలు మన విద్య ఎక్కడుందో చూడండి అంటూ ఆదేశాలిచ్చారు. విదేశాల్లో విద్యాభ్యాసం పూర్తి చేసుకుని, విదేశాల్లోనే వరల్డ్ బ్యాంకులో ఉన్నత ఉద్యోగం చేసిన లోకేష్. విద్యాశాఖలో ఫ్యాన్సీ విదేశీ విద్యా విధానాలు అమలు చేయాలని యత్నించలేదు. గత పాలకుల మాదిరిగా టోఫెల్, ఐబీ అంటూ నేల విడిచి సాము చేయలేదు. నేషనల్ అచీవ్ మెంట్ సర్వే , Annual Status of Education Report (ASER) నివేదికల మేరకు కనీస అభ్యసనా సామర్థ్యాలు విద్యార్థుల్లో లేవని గుర్తించారు. ఇవి పెంపొందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు.
భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 38391 ప్రాథమిక పాఠశాలల్లో గ్యారెంటీడ్ ఫౌండేషన్ లిటరసీ న్యూమరసీ (G-FLN) అమలు ఆరంభించారు. ప్రతీ విద్యార్థికి బలమైన పునాది అభ్యసనాలు ఒత్తిడితో కాదు. ఉల్లాసంతో, ఆటపాటలతో మొదలవ్వాలి. అందుకే మన ప్రభుత్వ పాఠశాలల్లో 1, 2 తరగతుల విద్యార్థుల కోసం గ్యారెంటీడ్ ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ (G-FLN) కార్యక్రమాన్ని అమలు చేస్తుంది. మన ప్రాథమిక పాఠశాలల్లోకి అడుగు పెడితే, విద్యార్థులు పుస్తకాల్లోని అంశాలను బట్టీ పట్టడం కాకుండా, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్, ఎడ్యుటైన్ మెంట్ యాక్టివిటీస్ వంటి, బాలా ఫీచర్స్ వంటి బోధన ద్వారా ఎంతో సరదాగా, ఆహ్లాదకరంగా, ఆనందంగా, ఆడుతూ పాడుతూ నేర్పుతున్నారు.
చిత్రాల ద్వారా అక్షరాలు నేర్చుకోవడం, ఆటల ద్వారా అంకెలు లెక్కించడం వంటి పద్ధతుల ద్వారా తెలుగు, ఇంగ్లీష్ భాషలను బోధిస్తున్నారు. జ్ఞానజ్యోతి, జ్ఞానప్రకాశ్ వంటి మాడ్యూల్స్ ద్వారా ప్రతి అక్షరాన్ని, ప్రతి శబ్దాన్ని అనుభూతి చెందుతూ విద్యార్థులు నేర్చుకుంటున్నారు. పెద్ద తరగతులకు వెళ్ళే వరకు వేచి చూడకుండా, మొదటి నుండే పునాదిని బలంగా నిర్మించడం గ్యారంటీడ్ ఎఫ్ ఎల్ ఎన్ ప్రత్యేకత. విద్యార్థుల అభ్యసనా సామర్థ్యాలకు అనుగుణంగా, వారి స్థాయిని అంచనా వేసి తదనుగుణంగా పాఠ్య ప్రణాళిక సిద్ధం చేశారు. రెగ్యులర్ క్లాసులు పూర్తయిన తరువాత మధ్యాహ్నం 1 గంట నుంచీ 3.30 వరకూ రెమెడియల్ సెషన్స్ కొనసాగిస్తున్నారు.
