న్యూఢిల్లీ : దేశ వ్యాప్తంగా రోజు రోజుకు పెరుగుతున్న సిజేరియన్ల పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి లోక్ సభ సాక్షిగా. ప్రైవేట్ ఆస్పత్రులు, కార్పొరేట్ హాస్పిటల్స్ కేవలం కాసులను కొల్లగొట్టడమే ప్రధానంగా పెద్ద ఎత్తున సిజేరియన్లు చేస్తున్నారని వాపోయారు. ఈ సందర్భంగా మద్దిల గురుమూర్తి కేంద్ర సర్కార్ దృష్టిని సారించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రసవం సహజ ప్రక్రియ అని, వైద్యం అవసరం ఉన్నప్పుడు మాత్రమే సిజేరియన్ జరగాలని అన్నారు. ప్రైవేట్ ఆసుపత్రుల్లో అనవసరంగా జరుగుతున్న సిజేరియన్ డెలివరీల వల్ల ప్రజలపై ఆర్థిక భారం పడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. దీని వల్ల ఆరోగ్య పరంగా ప్రమాదాలు పెరుగుతున్నాయని ఎంపీ వాపోయారు.
ఈ అంశాన్ని పార్లమెంట్లో లేవనెత్తడం ద్వారా ప్రభుత్వం మరింత కఠిన చర్యలు తీసుకోవాలని కోరినట్లు తెలిపారు. తల్లి, శిశువుల ఆరోగ్యం దేశ భవిష్యత్తుతో ముడిపడి ఉన్న అంశమని, ఈ విషయంలో ప్రభుత్వ పర్యవేక్షణ, ప్రజల అవగాహన, బాధ్యతాయుత వైద్య సేవలు అత్యంత అవసరమని గురుమూర్తి స్పష్టం చేశారు. తల్లి, శిశువుల ఆరోగ్యాన్ని మెరుగు పరచేందుకు కేంద్ర ప్రభుత్వం జనని సురక్ష యోజన, జనని శిశు సురక్ష కార్యక్రమం, ప్రధాన్ మంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్, లక్ష్య, సుమన్ వంటి పథకాలను అమలు చేస్తున్నట్లు ఈ సందర్బంగా ఎంపీ ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు కేంద్ర ఆరోగ్య , కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి . ఈ పథకాల ద్వారా ఉచిత ప్రసవ సేవలు, సిజేరియన్ సహా అన్ని వైద్య సేవలు, మందులు, రవాణా, నాణ్యమైన గౌరవ ప్రదమైన చికిత్స అందిస్తున్నామని తెలిపారు.
