అమరావతి : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు మాజీ ఏపీపీఎస్సీ చైర్మన్ , సీనియర్ ఐపీఎస్ గౌతం సావంగ్ పై సంచలన ఆరోపణలు చేశారు శాసన సభలో. ఆయన మాజీ సీఎం జగన్ రెడ్డి అండ చూసుకుని ప్రభుత్వ రంగ సంస్థను నిర్వీర్యం చేశాడని మండిపడ్డారు. తను కొత్త చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన వెంటనే మాన్యువల్ ఎవాల్యుయేషన్కు ఆదేశాలిచ్చారని ఫైర్ అయ్యారు. 49 వేల డూప్లికేట్ ఓఎంఆర్ స్లిప్లు , డేటా టెక్ మెథడాక్స్ అనే చోట ముద్రించారని తెలిపారు సీఎం. ఎగ్జామినర్ల లిస్టును కూడా వాట్సప్, టెలిగ్రామ్ గ్రూపుల్లో పెట్టారన్నారు. జవాబు పత్రాల్లో వేర్వేరు రాతలను కూడా గుర్తించారని పేర్కొన్నారు. జవాబుపత్రాల్లో మార్పు చేర్పులు, ఓవర్ రైటింగ్స్ లాంటివి చోటు చేసుకున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. 734 ఓఎంఆర్ స్లిప్స్ లో 718 స్లిప్స్ లో మార్పు చేర్పులు జరిగాయన్నారు.
21 స్లిప్స్ పై ఎలాంటి సంతకాలూ లేక పోవటం ఈ అక్రమాలకు పరాకాష్ట అని అన్నారు. గ్రూప్ 1 పరీక్షలు రాసిన ఓ అభ్యర్ధిని ఎవాల్యుయేషన్ ఎగ్జామినర్ గా నియమించారని వెల్లడించారు.
ఎన్ని అవకతవకలు జరిగాయో చెప్పడానికి వీల్లేకుండా అక్రమాలు చేశారని ఆరోపించారు నారా చంద్రబాబు నాయుడు. జవాబు పత్రాలు దిద్దే హాల్లోకి 17 రోజుల పాటు సీసీ కెమెరాలు కూడా పెట్ట లేదన్నారు. మొబైల్ ఫోన్లను అనుమతించారని మండిపడ్డారు. హైకోర్టు దీనిపై విచారణ చేసి ఓ విశ్రాంత న్యాయమూర్తి నేతృత్వంలో 3 మెన్ కమిటీ వేసిందన్నారు. గ్రూప్ 1 సర్వీసు నియామకాల్లో ఊహకు కూడా అందని అక్రమాలు గత పాలకులు చేశారంటూ ఆరోపించారు. తప్పు చేసిన వ్యక్తులు ఎప్పటికైనా దొరికిపోతారు అనడానికి ఏపీపీఎస్సీ గ్రూప్ 1 పరీక్షలు ఓ ఉదాహరణ గా నిలుస్తుందన్నారు సీఎం. గత పాలనలో బరితెగించి చేసిన అతిపెద్ద స్కామ్ ఇదన్నారు. ఇలాంటి తప్పులు భవిష్యత్తులో జరక్కుండా పటిష్టమైన వ్యవస్థలు రూపొందించాల్సిన అవసరం ఉందన్నారు. తప్పు చేస్తే కఠినంగా శిక్షణ ఉంటుందన్న భయం వారిలో రావాలన్నారు. వ్యక్తుల కోసం వ్యవస్థ కాదని, యువత భవిష్యత్తు కోసమే వ్యవస్థలు ఉన్నాయనే విషయం గుర్తు పెట్టుకోవాలని అన్నారు. తప్పులు చేసి పారిపోవటం కాదు. ఎందుకు జరిగిందో చెప్పాల్సిన బాధ్యత వారికి ఉందన్నారు చంద్రబాబు నాయుడు.
