హెచ్‌ఐవీ బాధితుల ప‌ట్ల వివక్ష చూపొద్దు

పిలుపునిచ్చిన మంత్రి దామోద‌ర రాజ‌న‌ర‌సింహ‌

హైద‌రాబాద్ : రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దామోద‌ర రాజ న‌ర‌సింహ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. స‌మాజంలో రోజు రోజుకు హెచ్ ఐ వీ బాధితులు పెరిగి పోతున్నార‌ని ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. కానీ వారి ప‌ట్ల ప్రేమ పూర్వ‌కంగా ఉండాల‌ని సూచించారు. హెచ్‌ఐవీ బాధితులను సామాజికంగా ఇబ్బంది పెట్టడం‌ సరికాదని అన్నారు. వారికి కూడా గౌరవం, సహాయం, సమాన హక్కులు కల్పించాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు దామోద‌ర రాజ న‌ర‌సింహ‌. హెచ్‌ఐవీ , ఎయిడ్స్ (నివారణ, నియంత్రణ) చట్టం 2017 ప్రకారం, వివక్ష చూపడం చట్టరీత్యా నేరం అని వెల్ల‌డించారు.

ఇదిలా ఉండ‌గా హెచ్‌ఐవీ, ఎయిడ్స్‌పై అవగాహన కల్పిస్తూ తెలంగాణ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ… కేబుల్ బ్రిడ్జ్‌పై నిర్వహించిన‌ మానవహారం కార్యక్రమంలో ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ పాల్గొన్నారు. సమాజంలో హెచ్‌ఐవీ , ఎయిడ్స్‌పై విస్తృత అవగాహన కల్పించేందుకు ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ర్యాలీలు, మానవ హారాలు, మెడికల్ క్యాంప్స్ నిర్వహిస్తున్నాం అన్నారు మంత్రి.హెచ్‌ఐవీ అనేది మన శరీరంలోని రోగనిరోధక శక్తిని బలహీనపరచే వైరస్ అని తెలిపారు. చికిత్స తీసుకోకుండా ఉంటే అది ఎయిడ్స్‌గా మారుతుంద‌ని హెచ్చ‌రించారు.

రక్షణ లేని లైంగిక సంబంధాలు, కలుషిత రక్త మార్పిడి‌ తదితర కారణాలతో హెచ్‌ఐవీ వ్యాపిస్తుందన్నారు.షేక్ హ్యాండ్, ఆలింగనం, కలిసి భోజనం చేయడం వంటి సాధారణ పరిచయాల ద్వారా హెచ్‌ఐవీ వ్యాపించద‌ని చెప్పారు దామోద‌ర రాజ న‌ర‌సింహ‌. అవగాహన లేకపోవడం వల్లే భయాలు, అపోహలు, వివక్ష పెరుగుతున్నాయని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఒక్కప్పుడు హెచ్‌ఐవీ ప్రాణాంతక వ్యాధి.. కానీ, ఇప్పుడు ప్రాణాంతక వ్యాధి కాదన్నారు.. సమయానికి పరీక్షలు, సరైన చికిత్స తీసుకుంటే నాలుగైదు దశాబ్దాలు కూడా సాధారణ జీవితాన్ని గడపవచ్చని సూచించారు.

ప్రభుత్వం ఉచితంగా టెస్టులు, చికిత్స, మెడిసిన్స్ అందిస్తోంద‌ని చెప్పారు దామోద‌ర‌. రాష్ట్రవ్యాప్తంగా 127 టెస్టింగ్ సెంటర్లు, 33 ART సెంటర్ల ద్వారా 1.14 లక్షల మంది పేషెంట్లకు వైద్య సేవలు అందిస్తున్నాం అని తెలిపారు.

Leave A Reply

Your Email Id will not be published!