జగిత్యాల జిల్లా : కాంగ్రెస్ సర్కార్ పై నిప్పులు చెరిగారు మాజీ సీఎం కేసీఆర్. జగిత్యాల వేదికగా జరిగిన బహిరంగ సభలో వేలాది మందిని ఉద్దేశించి ప్రసంగించారు. రాష్ట్రంలో పాలన గాడి తప్పిందన్నారు. నేను చచ్చే ప్రసక్తి లేదు, చివరి దాకా తెలంగాణ కోసం నిలబడతానంటూ నిప్పులు చెరిగారు. చేతికొచ్చిన తెలంగాణను ఆగమాగం చేస్తున్నారంటూ ఆరోపించారు. పోలీసుల దోపిడీకి అడ్డు లేకుండా పోయిందన్నారు. భూముల ఆక్రమణలు, ప్రశ్నిస్తే కాల్చి వేతలు, కూల్చివేతలు తప్పా రాష్ట్రంలో ఏమీ లేదన్నారు. స్కీంలు, స్కాంలకు కాంగ్రెస్ కేరాఫ్ గా మారి పోయిందన్నారు. అన్నం పెట్టే అన్నదాతల పరిస్థితి రెంటికి చెడ్డ రేవడిలా తయారైందన్నారు కేసీఆర్. ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేద్దామన్న సోయి లేకుండా పోయిందన్నారు. తెలంగాణ పునర్ నిర్మాణం కోసం మరోసారి యుద్దం చేయాల్సిన పరిస్థితి నెలకొందన్నారు.
తాము పవర్ లోకి వచ్చిన తొలి రోజు నుంచే హైడ్రా అనేది ఉండదని సంచలన ప్రకటన చేశారు. మోసానికి గురవుతే ఇక గోస తప్పదని ఆనాడు హెచ్చరించినా మీరు వినలేదన్నారు. కోరి కొనితెచ్చుకున్న కాంగ్రెస్ సర్కార్ ప్రజల పాలిట శాపంగా మారిందన్నారు కేసీఆర్. రాష్ట్రాన్ని ఆగమాగం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక ప్రజలు తిరగబడే రోజు తప్పకుండా వస్తుందన్నారు. ఆరోజు కాంగ్రెస్ నేతల పరిస్థితి ఏమవుతుందో ఒక్కసారి ఆలోచించు కోవాలని అన్నారు. మూసీని బాగు చేస్తామనేపేరుతో పక్కా రియల్ ఎస్టేట్ దందా చేస్తున్నారంటూ ధ్వజమెత్తారు కేసీఆర్. పేదల ఇళ్లను టార్గెట్ చేసిన హైడ్రా భరతం పడతామని హెచ్చరించారు.
