చెన్నై : తమిళనాడు రాజకీయాలలో సరికొత్త అధ్యాయానికి తెర లేపాడు స్టార్ హీరో, టీవీకే పార్టీ చీఫ్ , సీఎం జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్ అలియాస్ దళపతి. తాజాగా ప్రముఖ మీడియా సంస్థ ఇండియా టుడే సీ ఓటర్ సర్వేలో దేశంలో ఎవరు ప్రధానిగా ఉంటే బావుంటుందన్న ప్రశ్నకు అత్యధికంగా మోదీ, రాహుల్ గాంధీ తర్వాత దక్షిణాది నుంచి జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్ నిలిచారు. దీంతో తమిళనాడులో ఆయన దేశానికి కాబోయే పీఎం అంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. దీనిని టీవీకే పార్టీ పాజిటివ్ గా తీసుకుంది. ఆ మేరకు ఎలాంటి స్పందన కనబర్చ లేదు. ప్రస్తుతం పాలనా పరంగా దేశంలోని అందరి సీఎంల కంటే ముందంజలో కొనసాగుతున్నారు సీఎం విజయ్. అయితే పార్టీ పరంగా ఏ కూటమిలోనూ చేరలేదు టీవీకే. ప్రస్తుతం కాంగ్రెస్, వీసీకే, వామపక్షాల మద్దుతతో కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు విజయ్. ఆయన ప్రజా రంజక పాలన అందిస్తున్నారు. ప్రధానంగా విద్య, వైద్యంపై ఫోకస్ పెట్టారు.
ఇదే క్రమంలో లోక్సభ ఎన్నికలకు సంబంధించి దాని వ్యూహం ఇంకా వెల్లడి కాలేదు టీవీకే. మరో వైపు ప్రధానమంత్రి పదవికి ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్కు 9 శాతం ప్రజా మద్దతు ఉందని తెలిపే సర్వేలు వెలువడిన నేపథ్యంలో కాంగ్రెస్ నేత , ఉన్నత విద్యాశాఖ మంత్రి పి. విశ్వనాథన్ స్పందించారు. తమ పార్టీ నేత రాహుల్ గాంధీయే తమ ప్రధాని అభ్యర్థి అని పేర్కొన్నారు. తమిళగ వెట్రి కళగం మంత్రులు కె.ఎ. సెంగోట్టయన్ , సి.టి.ఆర్. నిర్మల్ కుమార్ ప్రధాని పదవికి జోసెఫ్ విజయ్ను తమ పార్టీ అభ్యర్థిగా నిలబెట్టే అవకాశాన్ని తోసిపుచ్చలేదు. మాజీ ముఖ్యమంత్రి జె. జయలలిత 2014 లోక్సభ ఎన్నికల ప్రచారంలో తనను తాను ప్రధాని అభ్యర్థిగా ప్రకటించుకుని 37 స్థానాలను గెలుచుకున్న తరహా వ్యూహాన్ని టీవీకే అనుసరించాలని భావిస్తోందా అనే ప్రశ్నలు దీనివల్ల తలెత్తుతున్నాయి.
విజయ్ను జాతీయ నాయకుడిగా చూపించేందుకు టీవీకే ఉత్తర భారతదేశంలో ముమ్మర ప్రచారం చేస్తూ సోషల్ మీడియాలో రీల్స్ పోస్ట్ చేస్తున్న తరుణంలో, ఒక టెలివిజన్ ఛానెల్ నిర్వహించిన సర్వేలో ఆసక్తికర విషయం వెల్లడైంది. ప్రధాని నరేంద్ర మోదీ , రాహుల్ గాంధీల తర్వాత ప్రధాని అభ్యర్థిగా 9.2 శాతం మద్దతుతో విజయ్ మూడవ స్థానంలో ఉన్నారని ఆ సర్వే పేర్కొంది. టీవీకే నాయకుడి ఆలోచనలు, ప్రణాళికలు స్వచ్ఛమైన పాలనను అందించే లక్ష్యంతో ఉన్నాయని, ఇది ఆయనను జాతీయ స్థాయి నాయకుడిగా నిలబెట్టిందని పేర్కొంటూనే, భవిష్యత్తులో ఏం జరుగుతుందో ఇప్పుడే చెప్పలేమని అన్నారు టీవీకే మంత్రులు.
