హైదరాబాద్ : శివ నిర్వాణ దర్శకత్వం వహించిన మాస్ మహారాజా రవితేజ నటించిన చిత్రం ఇరుముడి. ఇప్పటికే సినీ వర్గాల అంచనాలను తలకిందులు చేస్తూ టాప్ లోకి దూసుకు పోతోంది. ఇప్పటికే రూ.100 కోట్లు దాటేసినట్లు టాక్. ఇది పక్కన పెడితే ఇరుముడి బిగ్ సక్సెస్ కావడంతో భారీ ధరకు ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ చేజిక్కించుకుంది. ఇక సినిమాను థియేటర్లలో చూడలేని అభిమానులకు తీపి కబురు చెప్పింది ఓటీటీ సంస్థ. సెప్టెంబర్ 18న ఇరుముడి తమ ప్లాట్ ఫారమ్ ద్వారా స్ట్రీమింగ్ కానుందని ప్రచారం జరుగుతోంది. అయితే దానిపై అధికారికంగా ప్రకటించలేదు . ఇదిలా ఉండగా బాక్సాఫీస్ వద్ద మంచి ఆదరణ పొందడంతో థియేటర్లలో ప్రదర్శన పూర్తయిన తర్వాత ఇప్పుడు అందరి దృష్టి ఈ సినిమా డిజిటల్ విడుదలపై పడింది. నెట్ఫ్లిక్స్ ఈ సినిమా ఓటీటీ హక్కులను దక్కించుకుంది. ఈ విషయాన్ని సదరు సంస్థ వెల్లడించింది కూడా.
సెప్టెంబర్ 18 తేదీ గురించి విస్తృతంగా ప్రచారం జరుగుతున్నప్పటికీ, నెట్ఫ్లిక్స్ లేదా చిత్ర నిర్మాతల నుండి అధికారిక ప్రకటన వచ్చే వరకు ప్రేక్షకులు వేచి చూడాల్సి ఉంటుంది. థియేటర్లలో సినిమాను చూడలేక పోయిన అభిమానులు, ఇప్పుడు తమ ఇళ్ల నుండే రవి తేజ నటనను ఆస్వాదించడానికి ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రంలో ప్రియా భవాని శంకర్ కథానాయికగా నటించగా, సాయి కుమార్, బేబీ నక్షత్ర , స్వసిక కీలక పాత్రలు పోషించారు. ఇక కథ విషయానికి వస్తే ‘ఇరుముడి’ కథ సీలేరు ప్రాంతంలోని పోలూరు గ్రామానికి చెందిన త్రినాథ్ (రవి తేజ) చుట్టూ తిరుగుతుంది. అతను ట్రక్ ఆటో నడుపుతూ , తన రెండు ఎకరాల పొలంలో అరటి సాగు చేస్తూ జీవనోపాధి పొందుతుంటాడు.
