స్వంత స‌ర్కార్ పై కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి ఫైర్

శాస‌న స‌భ‌లో మునుగోడు ఎమ్మెల్యే సీరియ‌స్ కామెంట్స్

హైద‌రాబాద్ : సీఎం రేవంత్ రెడ్డిని , మంత్రుల‌ను శాస‌న స‌భ వేదిక‌గా ఏకి పారేశారు కాంగ్రెస్ పార్టీకి చెందిన మునుగోడు ఎమ్మెల్యే కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి. ఎమ్మెల్యేల‌కు నిధులు ఇవ్వకుండా ఇబ్బందుల‌కు గురి చేస్తే ఎలా అని నిల‌దీశారు. ఇది మంచి ప‌ద్ద‌తి కాద‌న్నారు. ఇలాంటి చిల్ల‌ర వ్య‌వ‌హారాల‌ను తాను భ‌రించే ప్ర‌స‌క్తి లేద‌న్నారు. ఇదేం దిక్కుమాలిన ప్రభుత్వం అంటూ రాజ‌గోపాల్ రెడ్డి ప్రశ్నించారు. రేవంత్ రెడ్డిపై, సొంత ప్రభుత్వంపై మరోసారి తీవ్ర స్తాయిలో ఆగ్ర‌హం వ్య‌క్తం చేయ‌డం క‌ల‌క‌లం రేపుతోంది. ప్ర‌జ‌లు అన్నీ గ‌మ‌నిస్తున్నార‌ని, ప‌నులు చేయ‌లేక పోతున్నారంటూ త‌న‌పై తీవ్ర ఒత్తిళ్లు వ‌స్తున్నాయ‌ని దీనికి నేను ఏం స‌మాధానం చెప్పాల‌ని అన్నారు.

సీఎం రేవంత్ రెడ్డి కొడంగల్‌ను అభివృద్ధి చేసుకున్నట్లు, నాకు నా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవాలని ఉండదా అని స‌భా వేదిక‌గా నిల‌దీశారు కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి. ఉప ముఖ్య‌మంత్రి భట్టి విక్రమార్క మధిర నియోజకవర్గానికి, ఉత్తమ్ కుమార్ రెడ్డి హుజూర్ నగర్ నియోజకవర్గానికి లిఫ్ట్ లు తరలిస్తున్నారని ఆరోపించారు. ఎమ్మెల్యేల నియోజకవర్గంలో బిల్లులు ఇవ్వడం లేదని ఆరోపించారు. ప్రభుత్వం అంటే రేవంత్ రెడ్డి, మంత్రులు మాత్రమే కాదు.. ఎమ్మెల్యేలు అందరూ కలిస్తేనే ప్రభుత్వం అని గుర్తు పెట్టుకోవాల‌ని అన్నారు. నిధుల కోసం రేవంత్ రెడ్డి చుట్టూ, మంత్రుల చుట్టూ తిరగాలా? అని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ప్రాంతాలు, నియోజకవర్గాలపై వివక్ష చూపొద్ద‌ని, లేక‌పోతే ఆందోళ‌నకు దిగాల్సి ఉంటుంద‌ని హెచ్చ‌రించారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.

Leave A Reply

Your Email Id will not be published!