హైదరాబాద్ : ప్రజా శాంతి పార్టీ వ్యవస్థాపకుడు డాక్టర్ కేఏ పాల్ కీలక ప్రకటన చేశారు. తాజాగా రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖను ఏఐసీసీ మంత్రి పదవి నుంచి తప్పించింది. తక్షణమే రాజీనామా చేయాలని స్పష్టం చేసింది. ఇదిలా ఉండగా రాష్ట్రంలో రాజకీయాలు మరింత వేడిని రాజేశాయి. ఇదిలా ఉండగా కాంగ్రెస్ నుంచి తొలగింపు తర్వాత కొండా సురేఖను ప్రజాశాంతి పార్టీలో చేరాలని ఆహ్వానించారు డాక్టర్ కె.ఎ. పాల్ . సోషల్ మీడియాలో ఒక వీడియోను విడుదల చేశారు. ఆమెను తన పార్టీలోకి ఆహ్వానించారు. మంత్రివర్గం నుండి ఆమెను తొలగించడానికి కొద్దిసేపటి ముందు మాట్లాడారు. కొండా సురేఖ ఒక శక్తివంతమైన నాయకురాలని పేర్కొన్నారు. ఒకవేళ ఆమెను పక్కన పెట్టినట్లు భావిస్తే, తన పార్టీలో ఆమెకు ప్రముఖ స్థానం కల్పిస్తానని ఆయన హామీ ఇచ్చారు.
ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో అగ్రవర్ణ నాయకులకు మాత్రమే రాజకీయ భద్రత ఉందని, వెనుకబడిన తరగతులు, బలహీన వర్గాల నాయకులను లక్ష్యంగా చేసుకుని ఇబ్బందులకు గురి చేస్తున్నారని పాల్ ఆరోపించారు. తెలంగాణలోని బీసీ వర్గాలకు నిజమైన న్యాయం చేయగల ఏకైక రాజకీయ వేదిక తన ప్రజాశాంతి పార్టీయేనని ఆయన పేర్కొన్నారు. గురువారం నాడు దేవాదాయ , అటవీ శాఖ మంత్రి కొండా సురేఖను రాష్ట్ర మంత్రివర్గం నుండి తొలగించడం దారుణమన్నారు. ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఆమెను మంత్రివర్గం నుండి తక్షణమే తొలగించాలని నిర్ణయించారు. దీనికి సంబంధించిన సిఫార్సును గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లాకు పంపారు. టీపీసీసీక్రమశిక్షణా కమిటీ సిఫార్సు చేసిన నేపథ్యంలో ఈ చర్య తీసుకున్నారు. ఆమెను మంత్రివర్గం నుండి తొలగించాలని ఆ కమిటీ సిఫార్సు చేసింది.
