Morari Bapu Comment : ‘బాపు’ సత్యం ‘ప్రేమ’ శాశ్వతం
రామ్ చరిత్ మానస్ ప్రయాణం
Morari Bapu Comment : జీవితం నిరంతర ప్రయాణం. సాఫీగా సాగాలంటే కాస్తంత సేద దీరేందుకు గూడు కావాలి. అంతేనా సాంత్వన చేకూర్చే సాధనాలు అవసరమవుతాయి. దీనికి ఎలాంటి ఖర్చు అంటూ ఉండదు. పనిగట్టుకుని మనం వాటిని వ్యాపారం చేస్తే తప్ప. ఈ దేశాన్ని వెలిగించిన వారిలో ఎందరో ఉన్నారు. వారిలో నిత్యం ప్రకాశిస్తూ తమ మానాన తాము ప్రయాణం చేస్తూ సాగిపోతున్నారు. నిస్వార్థంగా సేవ చేస్తున్నారు. బతుకు ప్రారంభంలో కొంత ఇబ్బంది అనిపించినా రాను రాను అది అర్థం అవుతున్న కొద్దీ మరణం గురించిన ధ్యాస , భయం మొదలవుతుంది. దీని నుంచి బయట పడేందుకు ఆధ్యాత్మిక చింతన ఆసరాగా నిలుస్తుంది. కొందరు దీనిని వ్యతిరేకించ వచ్చు లేదా పూర్తిగా తప్పు పట్టవచ్చు. మానసికంగా చితికి పోయినప్పుడు, శారీరకంగా అలసి పోయినప్పుడు కాస్తంత విరామం కావాలని అనిపిస్తుంది.
ఆ సమయంలో ఒంటరితనాన్ని మనసు కోరుకుంటుంది. ఎంత ఖర్చు చేసినా , కోట్లు వెదజల్లినా , అందమైన భవంతులలో ఉన్నా, గాలి మోటార్లలో తిరిగినా ఏదో వెలితి ఉండనే ఉంటుంది. అది ప్రతీ క్షణం గుర్తు చేస్తుందో. ఏదో కోల్పోతున్నావన్న భావనను తిరిగి వెంటాడేలా చేస్తుంది. వీటన్నింటి నుంచి బయట పడేసే మార్గం ఒక్కటే ఆధ్యాత్మిక లోగిలి. అందు లోకి ప్రవేశించాలంటే భజనలు కావాలి. కోట్లాది మందిని నేటికీ ప్రభావితం చేస్తున్నది తులసీ దాస్ కలంలోంచి జాలు వారిన రామ్ చరిత్ మానస్.
దానినే తన ఇంటి పేరుగా మార్చుకున్నారు మొరారీ బాపు(Morari Bapu). ఆయన ఉద్దేశం, లక్ష్యం, జీవిత పరామర్థం ప్రేమ..కరుణ..సత్యం మాత్రమేనంటారు. ఆయన జగమెరిగిన ఆధ్యాత్మికవేత్త. భారతీయ భావజాలాన్ని నరనరాన నింపుకుని అహింస లేని ప్రేమను పంచే పనిలో నిమగ్నమయ్యారు. ఆ దిశగా సాగుతున్నారు. ఇప్పుడు ఆయన వయసు 77 ఏళ్లు.
స్వస్థలం గుజరాత్ లోని తల్గజర్ద. బోధకుడిగా వేలాది మందిని ప్రభావితం చేస్తున్నారు మొరారి బాపు(Morari Bapu). 60 ఏళ్ల కాలంలో 900 కంటే ఎక్కువ కథలతో రామ్ చరిత్ మానస్ ను ప్రచారం చేశాడు. ప్రభావితం అయ్యేలా చూశాడు. సనాతన గ్రంథాలను పరిచయం చేస్తూ వచ్చారు. చిన్నతనం నుంచే భక్తిని అనుసరించాడు. నింబార్క్ సంప్రదాయన్ని అనుసరించాడు. పూజ్య ధ్యాన్ స్వామి బాపా శిష్యుడు. తాత, ఆధ్యాత్మిక గురువు అయిన త్రిభువందాస్ మార్గదర్శకత్వాన్ని పుణికి పుచ్చుకున్నాడు మొరారీ బాపు. నాథ్ ద్వారాలో ఆయన ప్రవచించిన రామ్ చరిత్ మానస్ ను 9 రోజుల వ్యవధిలో 1.2 మిలియన్ల మంది వీక్షించారు. ఇది ఓ రికార్డ్. 1976లో కెన్యాలోని నైరోబీలో మొదటిసారి ఉపదేశం ఇచ్చాడు. మతం కంటే మానవత్వం గొప్పదంటారు మొరారీ బాపు. సత్యాన్ని ధరించడం, ప్రేమను పొందడం, కరుణను చూపడం నేటి ప్రపంచానికి కావాల్సింది అంటారు. బాపు చూపిన మార్గం ఒక్కటే చదువుకోవడం. పఠించడం. ఇదే జీవితాన్ని మరింత ఫలవంతం చేస్తుందంటారు. నిజం కదూ.
Also Read : Nara Lokesh : ఇసుక మాఫియా దెబ్బకు పెన్నా విలవిల
