మంగళగిరి : గత ఐదేళ్ల వైసీపీ పాలనలో ‘ఉత్తుత్తి ఆంధ్ర’గా మారి, విధ్వంసానికి గురైన ఉత్తరాంధ్ర ప్రాంతం నేడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో అభివృద్ధి పథంలో దూసుకు పోతోందని ఎంపీ కలిశెట్టి అప్పల నాయుడు పేర్కొన్నారు. కేవలం రెండేళ్లు కూడా పూర్తికాక ముందే ఉత్తరాంధ్రను పారిశ్రామిక హబ్గా మార్చేలా ప్రభుత్వం అడుగులు వేస్తోందని ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఆదివారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్టాడారు. ఉత్తరాంధ్ర ముఖచిత్రాన్ని మార్చేలా దేశంలోనే అతిపెద్ద గ్రీన్ ఫీల్డ్ ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ కు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మార్చి 23న సోమవారం శంకు స్థాపన చేయనున్నారని వెల్లడించారు ఎంపీ.
దాదాపు 1.5 లక్షల కోట్ల భారీ పెట్టుబడితో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టును 2029 కల్లా పూర్తి చేయాలని ప్రభుత్వం పక్కా ప్రణాళికతో ఉందని చెప్పారు. ఈ ఒక్క పరిశ్రమ ద్వారానే దాదాపు లక్ష మందికి పైగా నిరుద్యోగ యువతకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి అవకాశాలు లభించనున్నాయని తెలిపారు. ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల స్వప్నమైన భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఈ ఏడాది జూన్ నాటికి ప్రారంభం కాబోతోందని ప్రకటించారు అప్పల నాయుడ. స్టీల్ ప్లాంట్, ఎయిర్పోర్ట్.. ఈ రెండు ప్రాజెక్టులు ఉత్తరాంధ్ర అభివృద్ధికి రెండు కళ్ల వంటివని, ఇవి భవిష్యత్తు తరాలకు బంగారు బాటలు వేస్తాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు. జగన్ మోహన్ రెడ్డి హయాంలో ఉత్తరాంధ్ర వనరులను దోచుకున్నారు తప్ప, ఇక్కడి యువతకు ఉపాధి కల్పించాలనే ఆలోచన చేయలేదని ఆరోపించారు.
