చెన్నై : తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని , ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తీసుకున్న ఏకపక్ష నిర్ణయాలను ఉతికి ఆరేశారు సభా సాక్షిగా. దేశ వ్యాప్తంగా గందరగోళానికి, తీవ్ర నిరసనలు, ఆందోళనలకు దారి తీసిన నీట్ యుజి 2026 పరీక్ష లీక్ పై ప్రత్యేకంగా ప్రస్తావించారు. అంతే కాకుండా త్రిభాషా విధానంపై కూడా ఒప్పుకునేది లేదని ప్రకటించారు. తమిళనాడు అస్తిత్వాన్ని దెబ్బతీసే ఏ కుట్రను, ఇంకే చర్యలను ఒప్పుకోబోమంటూ స్పష్టం చేశారు సీఎం. ఈ సందర్బంగా ఆయన కీలక ప్రసంగం చేశారు. అనేక కుట్రలు, ఆంక్షలను అధిగమించి తన పార్టీ విజయం సాధించిందని విజయ్ గుర్తుచేశారు; తాము గానీ, తమ పార్టీ కానీ కనుమరుగయ్యే ఉద్దేశం లేదని ఆయన స్పష్టం చేశారు.
.
తమ పార్టీ ‘తమిళగ వెట్రి కళగంస (టీవీకే)ను కేవలం నటుల పార్టీ అని ముద్ర వేసిన విమర్శకులకు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ గట్టిగా బదులిచ్చారు. కేంద్ర ప్రభుత్వం హిందీయేతర రాష్ట్రాలపై హిందీని రుద్దుతోందన్న ఆరోపణల నుండి నీట్ వైద్య ప్రవేశ పరీక్షను రద్దు చేయాలన్న డిమాండ్ల వరకు అనేక అంశాలపై ప్రసంగించారు. టీవీకే రాజకీయ మనుగడ, తన పరిపాలనా సామర్థ్యాలపై సందేహాలు వ్యక్తం చేసిన వారికి ఆయన గట్టిగా సమాధానమిచ్చారు.
అధికారం సులభంగా దక్కదని, తమిళ ప్రజల హృదయాల్లో స్థానం సంపాదించడానికి ఉద్యమంలో ఉన్నవారికి మాత్రమే తాము ఎదుర్కొన్న పోరాటాలు తెలుసని పేర్కొన్నారు. తమ పార్టీ చట్టబద్ధతను అర్థం చేసుకోలేమని, ఇది కేవలం నటుల ప్రదర్శన అని విమర్శించే వారికి ఆయన బదులిచ్చారు; అటువంటి విమర్శలను తమ పార్టీ పట్టించుకోదని అన్నారు. వ్యవస్థలోని అన్ని అడ్డంకులను దాటి తాము సాధించిన 35 శాతం ఓట్లు , తమ పారదర్శక రాజకీయ విధానాల గురించి ప్రస్తావించారు. భారతదేశంలోని ఏ వైద్య కళాశాలలోనైనా చేరడానికి అవసరమైన ఏకైక అర్హత పరీక్ష అయిన వివాదాస్పద నీట్ (NEET – నేషనల్ ఎలిజిబిలిటీ-కమ్-ఎంట్రన్స్ టెస్ట్) అంశంపై విజయ్ స్పందించారు. ప్రస్తుత విధానం తీవ్ర అసమానతలకు దారితీస్తోందని ఆరోపించారు. దీనిని పూర్తిగా రద్దు చేయాలని మరోసారి డిమాండ్ చేశారు.
