వరంగల్ జిల్లా : తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం నుంచి బర్తరఫ్ కు గురైన దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ నిప్పులు చెరిగారు. ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఆమె చేసిన కామెంట్స్ కలకలం రేపుతున్నాయి. తనను తొలగించే ముందు ఒక్క మాటైనా హైకమాండ్ చెప్పి ఉండాల్సి ఉందన్నారు. 30 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎక్కడా రాజీ పడలేదన్నారు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానంపై తీవ్రమైన ఒత్తిడి తీసుకు వచ్చారని, ఆపై కొండా సురేఖ అన్నా ఉండాలి లేదా తానన్న ఉండాలని పంతం పట్టారని, చివరికి బ్లాక్ మెయిల్ రాజకీయాలకు తెర లేపిన ఘనత రేవంత్ రెడ్డికి దక్కుతుందన్నారు కొండా సురేఖ. నన్ను తొలగించక పోతే తాను వెళ్లిపోతానని రేవంత్ రెడ్డి బెదిరింపులకు దిగారంటూ మండిపడ్డారు. తాను కాంగ్రెస్ పార్టీకి , ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసే ప్రసక్తి లేదన్నారు. పార్టీలోనే ఉంటానని తాడో పేడో తేల్చుకుంటానని, అంత వరకు నిద్ర పోయే ప్రసక్తి లేదన్నారు.
నిజానికి అధిష్ఠానానికి నన్ను తొలగించే ఆలోచనే లేదని షాకింగ్ కామెంట్స్ చేశారు కొండా సురేఖ. మంత్రి పదవి తొలగింపులో కుట్ర జరిగిందని ఆరోపించారు. కొండల్ రెడ్డి, తిరుపతిరెడ్డి, పొంగులేటి, వేం నరేందర్ రెడ్డి నాపై కుట్ర చేశారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నాకు సమాచారం ఇవ్వకుండా బర్తరఫ్ చేశారని ఫైర్ అయ్యారు . ఎలాంటి సంతకం లేకుండా లేఖ రిలీజ్ చేశారన్నారు. తాను ఇప్పటి వరకు భవిష్యత్తు కార్యాచరణ గురించి ఆలోచించ లేదన్నారు కొండా సురేఖ. నా కూతురు కొండా సుష్మితా పటేల్ మేజర్. ఆమె చేసిన వ్యాఖ్యలతో తనకు ఎలాంటి సంబంధం ఉంటుందని ప్రశ్నించారు. పదేళ్లుగా నా కూతురు టికెట్ కోసం ప్రయత్నం చేస్తోందన్నారు. కడియం తన కూతురిని ఎంపీ చేసుకోలేదా అని నిప్పులు చెరిగారు మాజీ మంత్రి. డి. శ్రీనివాస్ ఇంట్లో రెండు పార్టీలు లేవా అని నిలదీశారు. తాను ఇప్పటి వరకు ఎలాంటి అవినీతి, అక్రమాలకు పాల్పడలేదన్నారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పొంగులేటి, ఇతర మంత్రులు కరప్షన్ కు పాల్పడినట్లు బయట ఆరోపణలు ఉన్నాయన్నారు.
