ముంబై : రేపటి నుంచి మెగా ఐపీఎల్ టోర్నీ 2026 ప్రారంభం కానుంది. ఈ తరుణంలో భారీ ఎత్తున అంచనాలు నెలకొన్నాయి ఆయా జట్లపై. ప్రధానంగా ముగ్గురు కీలకమైన ఆటగాళ్లైన మహేంద్ర సింగ్ ధోనీ, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలపై కళ్లు ఉన్నాయని అన్నాడు మాజీ భారత క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్. జియో హాట్ స్టార్ తో ఆకాష్ చోప్రాతో కలిసి తన అభిప్రాయలను పంచుకున్నాడు. మొత్తం ఐపీఎల్ లో 10 జట్లు పాల్గొంటున్నాయి. చాలా మటుకు ఢిల్లీ, ముంబై, గుజరాత్, రాజస్థాన్ రాయల్స్, బెంగళూరు జట్లను టైటిల్ హాట్ ఫెవరేట్లుగా పేర్కొంటున్నారు. కానీ పఠాన్, ఆకాష్ చోప్రాలు మాత్రం ప్రత్యేకించి చెన్నై సూపర్ కింగ్స్ జట్టు గురించి ప్రస్తావిస్తున్నారు. రుతురాజ్ గైక్వాడ్ సారథ్యంలోని ఈ టీం ఇప్పుడు మరింత బలంగా ఉందన్నాడు.
ఇక ఇప్పటి దాకా సీఎస్కేకు ప్రత్యేకతను, బలాన్ని, బ్రాండ్ ఇమేజ్ ను కలిగించేలా చేయడంలో ముఖ్య భూమిక పోషించిన ఎంఎస్ ధోనీకి ఈ ఐపీఎల్ సీజన్ ఆఖరిది కాబోతోంది. ఈ తరుణంలో కీలకమైన ఆటగాడు రవీంద్ర జడేజా తప్పుకున్నాడు. తనను సీఎస్కే వదులుకుంది. తనతోపాటు సామ్ కరన్ ను కూడా వద్దనుకుంది. కేవలం ఒకే ఒక్క ఆటగాడు సంజూ శాంసన్ కోసం. తను ఐసీసీ టి20 వరల్డ్ కప్ లో హీరోగా నిలిచాడు. 5 ఇన్నింగ్స్ లలో 321 రన్స్ చేశాడు. దీంతో ఎవరు ధోనీ తదుపరి వారసుడు అవుతాడనే దానిపై చర్చోప చర్చలు కొనసాగుతున్నాయి. ఈ సమయంలో సంచలన వ్యాఖ్యలు చేశాడు ఇర్ఫాన్ పఠాన్. ధోనీ అసలైన వారసుడు ఒకే ఒక్కడు సంజు శాంసన్ అని కుండ బద్దలు కొట్టాడు.
