నెల్లూరు జిల్లా : మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని తిరిగి పునరుద్దరించాలని డిమాండ్ చేశారు ఏపీపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి. ఉపాధి హామీ పథక పరిరక్షణ యాత్ర కొనసాగుతోంది. ఈ యాత్ర గురువారం నెల్లూరు జిల్లాకు చేరుకుంది. మునుబోలు మండలం అక్కంపేట గ్రామంలో జరిగిన మన్రేగా పరిరక్షణ సభలో పాల్గొని ప్రసంగించారు. ఆనాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్న సమయంలోనే ఏపీ ఉమ్మడి రాష్ట్రం లో అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశారని గుర్తు చేశారు. పేదలకు ఎంతో మేలు జరిగేలా చేశారన్నారు. ఉచిత కరెంట్ తో వ్యవసాయాన్ని పండుగగా మార్చేసిన ఘనత వైఎస్సార్ దేనని అన్నారు షర్మిలా రెడ్డి. ఆరోగ్యశ్రీ పథకంతో పేదలకు ఎంతో మేలు చేకూరిందన్నారు. కోట్లాది మందికి ఆరోగ్య పరంగా సేవలు అందాయని , ఇంకా అందుతూనే ఉన్నాయన్నారు.
ఒక రకంగా చెప్పాలంటే ఆరోగ్య శ్రీ పథకం పేదలకు సంజీవినిగా మారింన్నారు షర్మిలా రెడ్డి. ఫీజు రీయంబర్స్ మెంట్ పథకంతో కోట్ల మంది ఉన్నత ఉద్యోగాలు చేస్తున్నారని అన్నారు. ఒకటి కాదు రెండు కాదు YSR తెచ్చిన ప్రతి పథకం అద్భుతం అన్నారు. తన తండ్రి ఆశయాల నుంచే కరవు పని పుట్టిందని చెప్పారు. 2006లో రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్న సమయంలోనే అనంతపురం జిల్లాలో ఉపాధి హామీ పథకం ప్రారంభమైందన్నారు ఏపీపీసీసీ చీఫ్. మన్మోహన్ సింగ్ , సోనియా గాంధీ ఈ పథకాన్ని బండ్లపల్లి నుంచి ప్రారంభించారని చెప్పారు. రాష్ట్ర గ్రామీణ అభివృద్దికి మన్రేగా పథకం ఎంతో దోహద పడేలా చేసిందన్నారు షర్మిలా రెడ్డి.
