కొత్త రాజధాని తీర్మానం సరే కేంద్రం నిధుల మాటేంటి..?
కీలక వ్యాఖ్యలు చేసిన ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి
విజయవాడ : ఏపీపీసీసీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి ప్రశంసలు కురిపించారు ఏపీ కూటమి సర్కార్ పై. శనివారం అమరావతి రాజధానిగా చేయాలని కోరుతూ సీఎం చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో శాసన సభలో తీర్మానం ప్రవేశ పెట్టారు. దీనికి ఆమోదం లభించడం విశేషం. దీనిపై స్పందించారు షర్మిలా రెడ్డి. మీడియాతో మాట్లాడారు విజయవాడలో. సెక్షన్ 5 సవరణకు కేంద్రాన్ని కోరడం న్యాయబద్ధమేనని పేర్కొన్నారు. మళ్లీ ఏ జగన్ లాంటోళ్లు వస్తే ఇబ్బంది ఏర్పడతుందన్నారు. ముందుచూపు ఉండడం మీ విజన్ కి నిదర్శనం అనుకుందాం అన్నారు. మరి రాజధాని కోసం విభజన చట్టంలో పెట్టిన సెక్షన్ 94(3) సంగతేంటి చంద్రబాబూ అని నిలదీశారు షర్మిలా రెడ్డి.
సెక్షన్ 5 ( సబ్ సెక్షన్ 2) లో ఎట్ అమరావతి పదాన్ని పెట్టించేందుకు ఉన్న శ్రద్ధ సెక్షన్ 94(3) కింద అమరావతి ఫండ్స్ అడిగేందుకు లేదా అని తీవ్ర స్థాయిలో ప్రశ్నించారు. గెజిట్ తోనే అమరావతి గెయిన్ అవుతుందా ? అని అన్నారు. ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని నిర్మాణ భాద్యత కేంద్రానిదే అని తెలియదా ? అని పేర్కొన్నారు. ఎంతైతే అంత కేంద్రం నిధులు ఇవ్వాల్సిందే అనే క్లాజ్ సెక్షన్ 94(3d) చదవలేదా అని మండిపడ్డారు. కేంద్రం చేస్తున్న మోసంపై అసెంబ్లీ తీర్మానం ఎందుకు చేయడం లేదన్నారు. నిధులు హక్కుగా ఇవ్వాల్సిందేనని చేయొద్దా తీర్మానం ? విభజన చట్టానికి కేంద్రం తూట్లు పొడుస్తుంటే అసెంబ్లీ వేదికగా తీర్మానం వద్దా? మోడీ ఇచ్చిన చెంబుడు నీళ్లు, తట్టెడు మట్టితో సరిపెట్టుకుందామా ? ఇదే బీజేపీ రాజధానికి ఇచ్చిన గొప్ప ప్రసాదంగా భావిద్దామా అని ఎద్దేవా చేశారు.
