చెన్నై : ఐపీఎల్ 2026 మార్చి 28 శనివారం నుండి ప్రారంభం కానుంది. ఈ సమయంలో ఉన్నట్టుండి బిగ్ షాక్ తగిలింది రుతురాజ్ గైక్వాడ్ సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు. ఒక రకంగా తమిళ క్రికెట్ అభిమానులకు కోలుకోలేని దెబ్బ అని చెప్పక తప్పదు. నిన్నటి దాకా మైదానంలో కలియ తిరుగుతూ అందరినీ పేరు పేరునా పలకరిస్తూ వచ్చిన మాజీ కెప్టెన్, ఇంపాక్ట్ ప్లేయర్ మహేంద్ర సింగ్ ధోనీ ఐపీఎల్ లో కొన్ని మ్యాచ్ లకు దూరం కానున్నాడు. తను ప్రాక్టీస్ చేస్తున్న సందర్బంగా పిక్క కండరాలకు గాయం ఏర్పడింది. దీంతో సీనియర్ వైద్యుల సూచన మేరకు తను కొన్ని మ్యాచ్ లకు దూరం కానున్నట్లు సమాచారం.
ఒక రకంగా తమను దేవుడి కంటే గొప్పగా ఆరాదించే ధోని అభిమానులకు ఒక పెద్ద నిరాశ కలిగించే వార్త ఇది. ఈ విషయాన్ని ఇవాళ ఆ ఫ్రాంచైజీ అధికారికంగా వెల్లడించింది. ధోని ప్రస్తుతం పిక్క కండరాల గాయం నుంచి కోలుకునేందుకు పునరావాస చికిత్స పొందుతున్నారు. దీని ఫలితంగా, ఆయన తొలి రెండు వారాలకు దూరమయ్యే అవకాశం ఉంది అని సీఎస్కే స్పష్టం చేసింది. ఇక షెడ్యూల్ లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఈనెల 30న గౌహతిలో రాజస్థాన్ రాయల్స్తో జరిగే మ్యాచ్తో తలపడనుంది. ధోని కేవలం ఐపీఎల్ లో మాత్రమే ఆడుతుండటంతో, మ్యాచ్ ఫిట్నెస్ను కొనసాగించడం ఆయనకు మరింత కష్టంగా మారుతోంది. గైక్వాడ్ కెప్టెన్ గా ఉన్నప్పటికీ మొత్తం జట్టంతా తన కనుసన్నలలోనే జరుగుతుంది.
