అమరావతి : మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తన తండ్రి, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి చేసిన పాదయాత్ర గురించి ప్రస్తావించారు. గురువారం ఎక్స్ వేదికగా గుర్తు చేశారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. ఒక నాయకుడు చేసిన పాదయాత్ర రాష్ట్ర చరిత్రను తిరగ రాయగలదని నిరూపించిందన్నారు. నాడు నాన్న చేపట్టిన పాదయాత్ర అని పేర్కొన్నారు. నాకు బాగా గుర్తు ఏప్రిల్ 9, 2003లో ఎర్రటి ఎండలో ప్రజల కష్టాల్లో పాలు పంచుకునేందుకు నాన్న చేపట్టిన ఆ పాదయాత్ర రాష్ట్ర ప్రజల హృదయాల్లో ధైర్యం నింపిందని పేర్కొన్నారు. నేనున్నాననే భరోసా ఇచ్చిందన్నారు.
నాన్నకు రాష్ట్రం మొత్తం మద్దతుగా నిలిచి ముఖ్యమంత్రిని చేసిందని చెప్పారు. నాన్న సీఎం కాగానే ఉచిత విద్యుత్ ఫైల్పై తొలి సంతకం చేసిన దగ్గరి నుంచి ఆయన తీసుకు వచ్చిన ఎన్నో సంస్కరణలు, పథకాలు రాష్ట్ర రూపు రేఖలే కాదు దేశానికి కూడా ఆదర్శంగా మారాయన్నారు జగన్ మోహన్ రెడ్డి. రైతును రాజుగా నిలిపాయి. అక్కచెల్లెమ్మలు వారి సొంత కాళ్లపై నిలబడేలా చేశాయి. బడుగు, బలహీన వర్గాలకు బతుకుపై భరోసానిచ్చాయని పేర్కొన్నారు జగన్ రెడ్డి. ఎంతో మంది పేద పిల్లలు డాక్టర్లుగా, ఇంజినీర్లుగా, కలెక్టర్లుగా అయ్యేలా చేశాయని తెలిపారు. ఎన్నో సాగునీటి, తాగునీటి ప్రాజెక్టులు పూర్తి అయ్యాయి. ఆంధ్రుల జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు పనులను పరుగులు పెట్టించారు. విద్య, వైద్యం, వ్యవసాయం, పారిశ్రామిక రంగాల్లో నాన్న వేసిన ఆ ముద్రను ఎవరూ చెరిపేయలేనిది. నాన్న చేపట్టిన పాదయాత్ర నేటికి 23 ఏళ్లు అయిన సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ నా ఈ ప్రయాణం కొనసాగుతుందని స్పష్టం చేశారు.
