ఏలూరు జిల్లా : అభివృద్ది నినాదం, సంక్షేమం లక్ష్యంగా తమ సర్కార్ పని చేస్తోందని చెప్పారు రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత. గురువారం ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గ పరిధిలోని పెదపాడులో నూతనంగా నిర్మించిన పోలీస్ స్టేషన్ భవనాన్ని ప్రారంభించారు. . ప్రజలకు రక్షణ కల్పించడంతో పాటు, పోలీసు వ్యవస్థను మరింత బలోపేతం చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యం అని స్పష్టం చేశారు. శాంతిభద్రతల పరిరక్షణలో సాంకేతికతను జోడిస్తూ, బాధితులకు త్వరితగతిన న్యాయం అందేలా ఈ నూతన భవనం సేవలందిస్తుందని చెప్పారు.
గంజాయి, డ్రగ్స్ వంటి మాదక ద్రవ్యాలపై ఉక్కుపాదం మోపుతున్నాం అన్నారు. గతంతో పోలిస్తే గంజాయి అక్రమ రమణా భారీగా తగ్గిందన్నారు అనిత వంగలపూడి. ఇప్పటికే అనేక మందిని అరెస్టులు చేసి కేసులు పట్టాం అన్నారు. జగన్ వంటి అవివేకులు గురించి ఎక్కడపడితే అక్కడ ప్రస్తావించు కోవడం అనవసరం అన్నారు. మంచి కార్యక్రమాలు చేసుకునేటప్పుడు అటువంటి తెలివి తక్కువ వ్యక్తులు గురించి మాట్లాడు కోవడం అనవసరం అని పేర్కొన్నారు. ఏలూరు జిల్లాలో శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా పోలీస్ అధికారులు తీసుకోనే చర్యలు బాగున్నాయని ప్రశంసించారు.
అనంతరం కొత్తగా నిర్మించిన పెదపాడు – వట్లూరు రహదారిని ఈరోజు ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు అనిత వంగలపూడి. ఈ రహదారి అందుబాటులోకి రావడం వల్ల స్థానిక ప్రజలకు ప్రయాణ సౌకర్యం మెరుగు పడటంతో పాటు, రవాణా ఇబ్బందులు తొలగిపోనున్నాయని తెలిపారు. ప్రజల సౌకర్యార్థం అభివృద్ధి పనులను మరింత వేగవంతం చేస్తాం అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు చింతమనేని, బడేటి చంటి, ధర్మరాజు, ఏలూరు రేంజ్ ఐజీ అశోక్ కుమార్ , ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
