Palla Simhachalam: టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుకు పితృ వియోగం

టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుకు పితృ వియోగం

 

టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావుకు పితృవియోగం కలిగింది. పల్లా శ్రీనివాస్ తండ్రి, మాజీ ఎమ్మెల్యే పల్లా సింహాచలం (93) అనారోగ్యంతో మృతి చెందారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో కేర్ ఆస్పత్రిలోనే చికిత్స పొందుతున్న పల్లా సింహాచలం… పరిస్థితి విషమించడంతో శనివారం ఆసుపత్రిలోనే ఆయన తుది శ్వాస విడిచారు. పల్లా సింహాచలం మృతి పట్ల సీఎం చంద్రబాబు సహా, మంత్రులు, టీడీపీ నేతలు, కార్యకర్తలు సంతాపం తెలియజేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.

సీఎం చంద్రబాబు సంతాపం

 

టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ తండ్రి పల్లా సింహాచలం మృతికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంతాపం తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని భగవంతుణ్ని ప్రార్థించారు. విశాఖపట్నం-2 ఎమ్మెల్యేగా 1994లో గెలిచి నియోజకవర్గ అభివృద్ధికి సింహాచలం కృషి చేశారని కొనియాడారు. పల్లా కుటుంబ సభ్యులకు సీఎం చంద్రబాబు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

సింహాచలం మృతికి చింతిస్తున్నా – డిప్యూటీ సీఎం పవన్

 

తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు తండ్రి, విశాఖ–2 మాజీ ఎమ్మెల్యే పల్లా సింహాచలం మృతి చెందారని తెలిసి చింతిస్తున్నానని ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. సింహాచలం ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. సుదీర్ఘ కాలంగా ప్రజా జీవితంలో ఉన్న ఆయన విశాఖ నగరం, పరిసర ప్రాంతాలలో సమస్యలపై పోరాడారన్నారు. ప్రజా పక్షం వహిస్తూ విశాఖపట్నం అభివృద్ధికి కృషి చేశారన్నారు. పితృ వియోగంతో బాధపడుతున్న పల్లా శ్రీనివాస రావు, వారి కుటుంబ సభ్యులకు ఉపముఖ్యమంత్రి పవన్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

మంత్రి లోకేష్ ప్రగాఢ సంతాపం

 

టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు తండ్రి, మాజీ ఎమ్మెల్యే పల్లా సింహాచలం మృతిపట్ల మంత్రి నారా లోకేష్ ప్రగాఢ సంతాపం తెలియజేశారు. 1989 నుంచి తెలుగుదేశం పార్టీకి ఆయన సేవలందించారన్నారు. 1994లో జరిగిన ఎన్నికల్లో విశాఖపట్నం-2 ఎమ్మెల్యేగా విజయం సాధించి నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేశారన్నారు. పల్లా సింహాచలం సౌమ్యుడిగా పేరుగాంచారని తెలిపారు. శాసనసభ్యుడిగా ప్రజలకు అన్ని విధాల అండగా నిలిచారని అన్నారు. వారి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని… పల్లా కుటుంబ సభ్యులకు మంత్రి లోకేష్ తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

 

ఎమ్మెల్యేగా ఎనలేని సేవలు అందించారు – హోం మంత్రి అనిత

 

పల్లా సింహాచలం మృతిపట్ల హోం మంత్రి వంగలపూడి అనిత దిగ్భ్రాంతి వక్తం చేశారు. పల్లా శ్రీనివాస్ కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. సింహాచలం ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ని ప్రార్థిస్తున్నానన్నారు. పల్లా సింహాచలం ఎమ్మెల్యేగా విశాఖ ప్రజలకు ఎనలేని సేవలందించారని హోంమంత్రి అనిత తెలిపారు.

 

Leave A Reply

Your Email Id will not be published!