హైదరాబాద్ : మాజీ మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ అంటేనే తెలంగాణ అని , ఆయన లేకుండా రాష్ట్రాన్ని ఊహించ లేమన్నారు. సీఎం రేవంత్ రెడ్డి తన ఆనవాళ్లు చెరిపి వేయాలని చూస్తున్నాడని, కానీ ఆయన ఆటలు సాగవన్నారు. శనివారం కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్బంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఎవరు పోరాడితే ఈ స్వరాష్ట్రం వచ్చిందో గమనించాలని అన్నారు. ఇవాళ తెలంగాణ గడ్డపై ఒక వికృతమైన రాజకీయ క్రీడ జరుగుతోందని అన్నారు. పద్నాలుగేళ్ల సుదీర్ఘ పోరాటంతో, ఢిల్లీ పీఠాన్ని గడగడలాడించి స్వరాష్ట్ర స్వప్నాన్ని సాకారం చేసిన నాయకుడు కేసీఆర్ అని అన్నారు. ఒక తండ్రిలా ఈ రాష్ట్రాన్ని అక్కున చేర్చుకుని, పడావు పడ్డ తెలంగాణను ప్రగతి బాటలో నడిపించిన మహోన్నత శిల్పి కేసీఆర్ అని పేర్కొన్నారు కేటీఆర్.
తన జీవితం అంతా తెలంగాణ కోసం పోరాటం చేశారని గుర్తు చేశారు. ఎప్పుడూ బిరుదుల కోసం పాకులాడ లేదని అన్నారు సన్మానాల కోసం తపించలేదని స్పష్టం చేశారు. ఎందుకంటే, తెలంగాణ ప్రజల శ్రేయస్సు, సంక్షేమమే ఆయనకు నిజమైన సన్మానం, సత్కారం అని తెలిపారు. ఉద్యమ సారథిగా పద్నాలుగేళ్లు చారిత్రాత్మక పోరాటం చేసినా తొలి ముఖ్యమంత్రిగా తెలంగాణ పల్లె పల్లెను పచ్చగ చేసినా.. ఆయన గుండె చప్పుడు అనుక్షణం తెలంగాణనే అని మరోసారి ప్రకటించారు కేటీఆర్. కానీ, నేడు అధికారం చేతిలో ఉందనే అహంకారంతో, తన వైఫల్యాలను, తన ప్రభుత్వ అవినీతిని కప్పిపుచ్చుకోవడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేసీఆర్ మీద, ఆయన వ్యక్తిత్వం మీద విషం చిమ్ముతున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది కేవలం ఒక వ్యక్తి మీద దాడి కాదు.. తెలంగాణ పోరాట చరిత్ర మీద జరుగుతున్న దాడిగా పరిగణించాలని అన్నారు.