అమరావతి : నిర్దేశించుకున్న లక్ష్యాలను పూర్తి చేసేందుకు ప్రయత్నం చేయాలని అన్నారు సీఎం నారా చంద్రబాబు నాయుడు. సోమవారం సీఎం అధ్యక్షతన కేబినెట్ కీలక మీటింగ్ జరిగింది. ఈ సందర్బంగా చంద్రబాబు ప్రసంగించారు. గడచిన 19 నెలల్లో అగాధం, అంధకారం నుంచి రాష్ట్రాన్ని బయట పడేశాం అని చెప్పారు. నిర్వీర్యమై పోయిన వ్యవస్థలను తిరిగి గాడిలో పెట్టడం జరిగిందన్నారు. సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలనకే తొలి ప్రాధాన్యం ఇస్తున్నాం అన్నారు. సూపర్ సిక్స్ సూపర్ హిట్ అయిందన్నారు. తల్లికి వందనం ద్వారా రూ.10 వేల కోట్ల తల్లుల ఖాతాల్లో వేశాం అని ప్రకటించారు. స్త్రీశక్తి ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ పథకం ద్వారా మొబిలిటి పెరిగిందని చెప్పారు నారా చంద్రబాబు నాయుడు. 4.29 కోట్ల ప్రయాణాలు ఇప్పటి వరకూ జరిగాయని అన్నారు. ప్రస్తుతం ఉన్న బస్సులతోనే ఆక్యుపెన్సీ పెరిగిందన్నారు.
అన్నదాత సుఖీ భవ ద్వారా రూ. 6,310 కోట్ల ఆర్ధిక సహకారం అందించామని చెప్పారు. .డిమాండ్ డ్రివెన్ క్రాప్స్ ఉత్పత్తి చేసేలా అవగాహన పెంచుతున్నాం అన్నారు. రాయలసీమలో హార్టి కల్చర్ హబ్, కోస్తాలో ఆక్వా కల్చర్ పెంచేలా చర్యలు చేపట్టామని తెలిపారు నారా చంద్రబాబు నాయుడు. రైతు ఆత్మహత్యలనేవి జరగ్గకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాం అని అన్నారు. ఎవరైనా ఆత్మహత్య చేసుకుంటే వాటిని అధ్యయనం చేసి రైతులను ఆదుకుంటున్నట్లు తెలిపారు సీఎం. దీపం.2.0 ద్వారా 2 కోట్ల సిలిండర్లు ఇప్పటి వరకూ ఇచ్చామన్నారు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల ద్వారా రూ.58 వేల కోట్ల మేర ఆర్ధిక చేయూత అందించాం అన్నారు. సంక్షేమ పథకాలు అవసరమా…? అనే చర్చ సరి కాదు.పేదలను ఆదుకునేందుకు సంక్షేమ పథకాలు అవసరమేనని స్పష్టం చేశారు.
