ఢిల్లీ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని క్రియేటర్ ఎకానమీగా తీర్చిదిద్దేందుకు వీలుగా తగిన ప్రణాళికల్ని సిద్ధం చేస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. దీనికి వివిధ టెక్ కంపెనీల భాగస్వామ్యం కూడా అవసరమని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఏపీలో టెక్ నైపుణ్యాలు ఉన్న యువశక్తి అతిపెద్ద వనరు అని ఆయన వ్యాఖ్యానించారు. వారిని ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, క్వాంటం టెక్నాలజీ రంగాల్లో నిపుణులుగా తయారు చేసేందుకు ఉన్న అవకాశాలను వినియోగించు కుంటామని ఆయన వెల్లడించారు. ఢిల్లీలోని ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026 లో దిగ్గజ పారిశ్రామిక వేత్తలతో నారా చంద్రబాబు నాయుడు వేర్వేరుగా భేటీ అయ్యారు. భారత్ మండపంలో ఉన్న ఏపీ పెవిలియన్ లో ఆడోబ్ సీఈఓ శాంతనూ నారాయణ్, ఆటోడెస్క్ ఏఐ హెడ్ మైక్ హాలే, ఆరామ్ కో ఇండియా డైరెక్టర్ అబ్దుల్ రెహమాన్ ఐతుకైర్ ముఖ్యమంత్రితో సమావేశం అయ్యారు.
వీరితో పాటు లెగో ఎడ్యుకేషన్ వైస్ ప్రెసిడెంట్ టామ్ హాల్ , ఆధార్ ఫౌండర్ సీటీఓ శ్రీకాంత్ నాదముని, కాలిఫోర్నియాకు చెందిన ఖోస్లా వెంచర్స్ మేనేజింగ్ డైరెక్టర్ వినోద్ ఖోస్లా సీఎంతో భేటీ అయ్యారు. ఏపీలో సౌర విద్యుత్ సహా క్లీన్ ఎనర్జీ ప్రాజెక్టులపై సౌదీ ఆరామ్ కో ప్రతినిధులతో ముఖ్యమంత్రి చంద్రబాబు చర్చలు జరిపారు. ఏపీలో తమ కార్యకలాపాలను విస్తరించాలని సౌదీ ఆరామ్ కో ను ముఖ్యమంత్రి ఆహ్వానించారు. గ్రీన్ ఎనర్జీ ఉత్పాదనకు ఏపీ అత్యంత అనువైన ప్రాంతమని నారా చంద్రబాబు నాయుడు వివరించారు. డౌన్ స్ట్రీమ్ పరిశ్రమలతో సహా సమగ్రమైన ఎకోసిస్టమ్ నిర్మాణంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టిందని వెల్లడించారు. ప్రముఖ టెక్ కంపెనీ ఆడోబ్ సిస్టమ్స్ సీఈఓ శంతనూ నారాయణ్ తో ముఖ్యమంత్రి చర్చలు జరిపారు.
