న్యూఢిల్లీ : ప్రస్తుతం ఇరాన్, ఇజ్రాయెల్ , అమెరికా దేశాల మధ్య చోటు చేసుకున్న యుద్ద వాతావరణ కారణంగా పలు విమానాల రాక పోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. ఈ తరుణంలో కీలక ప్రకటన చేసింది డీజీసీఏ. శుక్రవారం విమానయాన సంస్థలకు కీలక సూచనలు చేసింది. కొన్ని షరతులకు లోబడి ఒమన్, సౌదీ అరేబియా గగనతలాలపై భారతీయ విమానయాన సంస్థలు విమానాలను నడపవచ్చని రెగ్యులేటర్ తెలిపింది. తప్పనిసరిగా నివేదించాల్సిన పాయింట్ల ద్వారా నిర్వచించబడిన విభాగాలకు దక్షిణంగా ఉన్న సౌదీ అరేబియా, ఒమన్ గగనతలంలో FL 320 లేదా 32,000 అడుగుల కంటే తక్కువ ఎత్తులో విమానాలను నడప వద్దని విమానయాన సంస్థలకు సూచించింది.
పశ్చిమ ఆసియాలో ఘర్షణలు తీవ్రమవుతున్న నేపథ్యంలో భద్రతా పరమైన ప్రమాద అంచనాలలో భాగంగా, ఈ ప్రాంతంలోని తొమ్మిది గగనతలాలకు దూరంగా ఉండాలని, పటిష్టమైన ప్రణాళికలను రూపొందించు కోవాలని విమానయాన నియంత్రణ సంస్థ (డీజీసీఏ) విమానయాన సంస్థలను కోరింది. బహ్రెయిన్, ఇరాన్, ఇరాక్, ఇజ్రాయెల్, జోర్డాన్, కువైట్, లెబనాన్, ఖతార్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) గగనతలాలకు దూరంగా ఉండాలని స్పష్టం చేసింది. కొన్ని షరతులకు లోబడి ఒమన్ , సౌదీ అరేబియా గగనతలాలపై భారతీయ విమానయాన సంస్థలు విమానాలను నడపవచ్చని నియంత్రణ సంస్థ తెలిపింది.
ప్రభావిత గగనతలంలో అన్ని ఫ్లైట్ లెవెల్స్ , ఎత్తులలో కార్యకలాపాలు నిర్వహించకుండా ఉండాలని డీజీసీఏ విమానయాన సంస్థలను కోరింది. ఏవైనా కార్యకలాపాలు కొనసాగించడం అనేది ఆపరేటర్ భద్రతా ప్రమాద అంచనా ఆధారంగా వారి విచక్షణ మేరకు ఉంటుందని డీజీసీఏ జోడించింది
