ఏపీ అభివృద్ధికి జర్నలిస్టులు సహకరించాలి

పిలుపునిచ్చిన ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు

విజయవాడ : గత ప్రభుత్వంలో జర్నలిస్టులకు కనీసం మాట్లాడే స్వేచ్ఛ కూడా లేదని, కూటమి ప్రభుత్వం వచ్చాక ఏపీలో మీడియాకు ప్రశ్నించే స్వేచ్ఛ, మాట్లాడే స్వేచ్ఛను కల్పించామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. గతంతో పోల్చుకుంటే మీడియాలో విలువలు వేగంగా పడిపోతున్నాయని ఆవేద‌న చెందారు. విలువల పునరుద్దరణ జరిగేలా చూడాలని జర్నలిస్టులను సీఎం కోరారు. రాజకీయ పార్టీలకు సొంత మీడియా ఉండటం ప్రమాదానికి దారి తీస్తోందని అన్నారు. తమది జర్నలిస్ట్ ఫ్రెండ్లీ ప్రభుత్వమని, జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి శక్తి మేరకు కృషి చేస్తామని సీఎం హామీ ఇచ్చారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన ఐజేయూ 11వ ప్లీనరీ సమావేశానికి సీఎం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముఖ్యమంత్రికి ఐజేయూ ప్రతినిధులు ఘన స్వాగతం పలికారు. సీనియర్ జర్నలిస్టులను సీఎం అప్యాయంగా పలకరించారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ విజయవాడలో ఐజేయూ 11వ ప్లీనరీని జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఆనాడు ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు హైదరాబాద్ లో చేసిన అభివృద్ధి కార్యక్రమాలకు ఇప్పుడు ఫలితాలు కనిపిస్తున్నాయని ఐజేయూ ప్రతినిధులు చెప్పడం సంతోషంగా క‌లిగించింద‌ని పేర్కొన్నారు సీఎం. ప్రస్తుత కాలంలో జర్నలిజం బాగా మారి పోయిందన్నారు. మీడియా విపరీత పోకడలు సమాజానికి మంచిది కాదన్నారు. అలవోకగా అబద్ధాలను చిత్రీకరిస్తున్నారంటూ వాపోయారు. మీడియాలో విలువలు, సిద్దాంతాలు పడిపోతున్నాయని పేర్కొన్నారు. దీన్ని పునరుద్దరించు కోవాల్సిన అవసరం ఉందన్నారు.

2019లో తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వైఎస్ వివేకానందరెడ్డి చనిపోతే నాపై తప్పుడు వార్తలు రాశారని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. మొదట వైఎస్ వివేకా మరణాన్ని గుండె పోటుగా చిత్రీకరించారు. పోస్టు మార్టానికి ఆదేశించడంతో అసలు విషయాలు బయటపడే సరికి హత్య నెపాన్ని నాపై మోపారు. నారాసుర రక్త చరిత్ర అని నా చేతిలో కత్తి పెట్టి సాక్షిలో తప్పుడు వార్త రాశారు. తప్పుడు సమాచారాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారని మండిప‌డ్డారు. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం జరగ్గకుండా నియంత్రించేలా జర్నలిస్టులు కృషి చేయాలి అని సీఎం చంద్రబాబు కోరారు.

Leave A Reply

Your Email Id will not be published!