అమరావతి : అమరావతిపై మాజీ సీఎం జగన్ రెడ్డికి మాట్లాడే హక్కు లేదన్నారు మంత్రి కొలుసు పార్థసారథి. జగన్ కొత్త రాజధాని ప్రతిపాదన చూసి రాష్ట్ర ప్రజలు నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు. సొంత పార్టీ నాయకులు, కార్యకర్తలే జగన్ ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్నారని పేర్కొన్నారు. జగన్ రెడ్డి మూడు రాజధానుల ఆలోచనను రాష్ట్ర ప్రజలే ఛీత్కరించారని, చివరకు 11 సీట్లకు పరిమితం చేశారని, అయినా తనకు బుద్ది రావడం లేదన్నారు కొలువు పార్థసారథి. ఆదివారం మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో మంత్రి మీడియాతో మాట్లాడారు. గత ఐదేళ్ల వైసీపీ పాలనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనుభవించిన చీకటి రోజులను, రాజధాని విషయంలో జగన్మోహన్ రెడ్డి చేసిన చారిత్రక తప్పిదాలను ఎండగట్టారు.
గ్రామాల్లో ఒక సంప్రదాయం ఉంటుంది.. శుభకార్యాల సమయంలో అమంగళకరమైన పేర్లు పలకకూడదని భావిస్తారు. నేడు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ‘జగన్’ అనే పేరు కూడా అలాంటిదే అని మంత్రి వ్యాఖ్యానించారు. రాష్ట్రానికి రాజధాని అనేది ఒక గొప్ప సంబరం లాంటిదని, కానీ జగన్ ఆ సంతోష సమయంలో ‘కంటిలో నలుసులా’, ‘రాష్ట్రానికి పట్టిన చీడపీడలా’ తయారయ్యారని మండిపడ్డారు. రాజకీయ పక్షాలన్నీ అమరావతికి మద్దతు తెలుపుతుంటే, వైసీపీ మాత్రం పార్లమెంటులో వాకౌట్ చేసి రాష్ట్ర ప్రయోజనాలకు గండి కొట్టిందని విమర్శించారు.
అబద్ధాల పునాదుల మీద ‘వికేంద్రీకరణ’ డ్రామా ఆడారని ఆరోపించారు. అసెంబ్లీ సాక్షిగా అమరావతికి మద్దతు ప్రకటించి, అధికారంలోకి వచ్చాక సూట్కేసు రాజకీయాలు చేస్తూ రాజధాని విషయంలో మూడు ముక్కలాట ఆడారని ఎద్దేవా చేశారు. తన తప్పులను ఒప్పుకునే అలవాటు జగన్కు లేదని, ప్రజల అభిప్రాయాలను గౌరవించకుండా తన ఆలోచనలనే కార్యకర్తలపై రుద్దే నియంతలా వ్యవహరించారని మండిపడ్డారు. రాజధాని పేరును ‘మావిగన్’ గా మార్చాలని చూడటం ఆయన ‘తుగ్లక్’ పాలనకు నిదర్శనమని ధ్వజమెత్తారు.
