చెన్నై : తమిళనాడు రాష్ట్ర ప్రయోజనాలు అత్యంత ముఖ్యమని మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్. ఆయన ఇవాళ మీడియాతో మాట్లాడారు. కేంద్రంతో నిధులు రాబట్టు కోవడంలో రాజీ పడే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. తమకు తమ ప్రాంతం ముఖ్యమన్నారు. అంతే కాదు దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన నీట్, యుజీ 2026 పరీక్ష లీక్ కావడం పట్ల ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఈ తరుణంలో విజయ్ సంచలన ప్రకటన చేశారు. ఆయన కేంద్రంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ నిర్వాకం, చేతకానితనం వల్ల ఎంతో మంది విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారని ఆవేదన చెందారు. తక్షణమే నీట్ పరీక్షను రద్దు చేయాలని డిమాండ్ చేశారు విజయ్ జోసెఫ్ చంద్రశేఖర్.
అయితే మరో వైపు కేంద్ర ప్రభుత్వంతో వ్యవహరించే విషయంలో సీఎం చాలా తెలివిగా వ్యవహరిస్తున్నారు. బీజేపీని తమ సిద్ధాంతపరమైన ప్రత్యర్థిగా ప్రకటించినప్పటికీ, రాజకీయాలు వేరు, అలాగే రాష్ట్ర-కేంద్రాల మధ్య ఉండే పరిపాలనాపరమైన సంబంధాలు వేరని ఆయనకు స్పష్టమైన అవగాహన ఉంది. ముఖ్యమంత్రిగా రాష్ట్రానికి మేలు చేసే పనులను చేస్తూనే, కేంద్రంతో అనవసరంగా సంబంధాలు దెబ్బ తినకుండా చూసుకుంటున్నారు. రాష్ట్రానికి దక్కాల్సిన బకాయిలు ,హక్కులను పూర్తిగా సాధించుకోగల నాయకుడిగా ఆయన కనిపిస్తున్నారు. కేంద్రంతో నిరంతరం ఘర్షణ పడే ధోరణిని అవలంబించిన డీఎంకే తీరుకు ఇది పూర్తిగా భిన్నంగా ఉండడం గమనార్హం. ఇదిలా ఉండగా సిఎం విజయ్ చేసిన కామెంట్స్ రాష్ట్రంలో కలకలం రేపుతున్నాయి.
