హైదరాబాద్ : వాహనదారులను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు సిటీ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్. ప్రతి ఒక్క వాహనదారుడు విధిగా హెల్మెట్ ధరించాలని, ప్రాణాలను కాపాడు కోవాలని స్పష్టం చేశారు. హెల్మెట్ అనేది కేవలం జరిమానా భారం నుంచి మిమ్మల్ని రక్షించడానికి కాదన్నారు. మీ ఇంటి దీపం ఆరి పోకుండా చూసుకోవడానికి అది అత్యంత అవసరం అని నొక్కి చెప్పారు సీపీ. మీరు క్షేమంగా ఇంటికి తిరిగి రావాలని కోరుకునే మీ కుటుంబ సభ్యుల చిరునవ్వులను కాపాడటమే దాని ముఖ్య ఉద్దేశ్యం అని స్పస్టం చేశారు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వి.సి. సజ్జనార్ . తలకు తగిలే గాయాల నుండి రక్షణ పొందడంలో హెల్మెట్ ధరించడం ఎంత ముఖ్యమో ఆయన నొక్కి చెప్పారు.
బెంగళూరులోని రాజాజీనగర్లో ఇటీవల జరిగిన ఒక ప్రమాదంపై స్పందించారు. సోషల్ మీడియా ఎక్స్ మాధ్యమం వేదికగా ఆయన ఈ ఘటనను ప్రత్యేకంగా ప్రస్తావించారు. ప్రమాదాలు ఎప్పుడూ ముందస్తు సమాచారం ఇచ్చి రావని అన్నారు సిటీ పోలీస్ కమిషనర్. ప్రకృతి వైపరీత్యం కావచ్చు లేదా సాంకేతిక లోపం కావచ్చు… ప్రమాదం ఏ రూపంలో వస్తుందో ఎవరికీ తెలియదు అని అన్నారు. చాలామంది పోలీసులు లేదా జరిమానా భయంతోనే హెల్మెట్ ధరిస్తుంటారు. అది సరైన పద్ధతి కాదు అని ఆయన అన్నారు. క్షణికమైన అసౌకర్యం జీవితకాల వేదనకు కారణం కాకూడదు. అది చిన్న ప్రయాణమైనా లేదా సుదూర ప్రయాణమైనా సరే, హెల్మెట్ ధరించడం మర్చిపోవద్దు. గుర్తుంచుకోండి, మీ కుటుంబానికి మీరు ఇచ్చే అత్యుత్తమ బహుమతి మీ భద్రతే అని వీసీ సజ్జనార్ పేర్కొన్నారు.