చెన్నై : తమిళనాడు సీఎం జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్ దూకుడు పెంచారు. తనదైన శైలిలో పాలన సాగిస్తున్నారు. ఈ సందర్భంగా ఇతర సీఎంల కంటే భిన్నంగా విజినరీ తో ముందుకు సాగుతున్నారు. ఇందులో భాగంగా రాష్ట్ర అభివృద్ధి ప్రణాళిక రూపకల్పన కోసం జూలై 2 నుండి శాఖల వారీగా సమీక్ష చేపట్టనున్నారు. ఈ విషయాన్ని తమిళనాడు సర్కార్ ప్రకటించింది. దాదాపు నెల రోజుల పాటు ప్రభుత్వ శాఖల పనితీరుపై సమీక్ష నిర్వహించనున్నారని సీఎస్ తెలిపారు. శాఖాధిపతులతో జరిపే ఈ విస్తృతమైన సంప్రదింపులు, సీఎం విజయ్ నాయకత్వంలోని ‘తమిళగ వెట్రి కళగం’ ప్రభుత్వం ప్రవేశపెట్టబోయే తొలి బడ్జెట్పై దృష్టి సారించడానికి దోహద పడతాయి. ప్రతి ప్రభుత్వ శాఖకు సంబంధించి కీలక కార్యకలాపాలు, విధి విధానాలు, కార్యాచరణ ప్రణాళికలు, పారదర్శకత-సామర్థ్యం-సేవా పంపిణీని మెరుగు పరిచే సూచనలు , ప్రధాన సవాళ్లను వివరిస్తూ సంక్షిప్త ప్రజెంటేషన్ను సిద్ధం చేయాలని ప్రధాన కార్యదర్శి ఎం. సాయి కుమార్ అధికారులను ఆదేశించారు.
ఆర్థికపరమైన అంశాలతో కూడిన ప్రతిపాదనలను ఆర్థిక శాఖ అదనపు ప్రధాన కార్యదర్శితో చర్చించాలని నొక్కి చెప్పారు. అలాగే ప్రధాన కార్యదర్శి ఆమోదం పొందిన తర్వాత కనీసం రెండు రోజుల ముందే ఆ ప్రజెంటేషన్ను ముఖ్యమంత్రి కార్యాలయానికి సమర్పించాలని జూన్ 25 నాటి అధికారిక లేఖలో సాయి కుమార్ పేర్కొన్నారు. జూలై 2న సహకార, ఆహార, వినియోగదారుల రక్షణ శాఖతో సమీక్షా సమావేశాలను ప్రారంభిస్తారు సీఎం విజయ్. ఉన్నత విద్య, సామాజిక సంక్షేమం , మహిళా సాధికారత, కార్మిక సంక్షేమం, ఆది ద్రావిడ , గిరిజన సంక్షేమం, పరిశ్రమల శాఖ వంటి వివిధ విభాగాల కార్యకలాపాలను సమీక్షించి, జూలై 22న హోం, నిషేధం మరియు ఎక్సైజ్ శాఖల సమీక్షతో ఈ ప్రక్రియను ముగిస్తారు.
