బెంగళూరు : ఐఎన్టీయూసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రజా, కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తోందని ఆరోపించింది. కర్ణాటక లోని బెంగళూరులో ఆల్ ఇండియా ఐఎన్టీయూసీ 316వ కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సందర్బంగా కేంద్రంపై తీవ్ర స్తాయిలో మండిపడింది. కార్మికుల హక్కులు, గౌరవం , భద్రతకు ముప్పు కలిగించే నాలుగు కార్మిక చట్టాల ముసాయిదాలను తిరస్కరించాలని ఆ సంఘం అధ్యక్షుడు జి. సంజీవ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో కార్మిక రక్షణలు, సామాజిక న్యాయంపై చర్చలు జరిగాయి. కార్మిక వర్గం సాధించిన హక్కులు , చట్టపరమైన రక్షణలను కాపాడుకోవాల్సిన సమయం ఆసన్నమైందని సంజీవ రెడ్డి అన్నారు. ఈ కార్మిక చట్టాలను అమానవీయమైనవి, చట్టవిరుద్ధమైనవి అని ఆవేదన చెందారు.
అంతే కాదు ఈ చట్టాలు భారత రాజ్యాంగ విరుద్ధమైనవిగా అభివర్ణించారు. వీటి అమలు కార్మికులపై తీవ్ర ప్రభావం చూపుతుందని హెచ్చరించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న డి.కె. శివకుమార్ మాట్లాడుతూ, రైతులు, సైనికులు, కార్మికులు , ఉపాధ్యాయులు ఒక ప్రగతిశీల ప్రజాస్వామ్యానికి, సంపన్న దేశానికి నాలుగు స్తంభాల వంటివారని అన్నారు. రైతు దేశానికి ఆహారాన్ని అందిస్తాడు, సైనికుడు దేశాన్ని రక్షిస్తాడు, కార్మికుడు ఆర్థిక వ్యవస్థను నిర్మిస్తాడు , ఉపాధ్యాయుడు భావి తరాలను తీర్చిదిద్దుతాడు అని ఆయన పేర్కొన్నారు. ఈ వర్గాలకు తగిన గౌరవం, రక్షణ , మద్దతు లభిస్తేనే సమాజం పురోగమిస్తుందని , నిలబడుతుందని శివకుమార్ అన్నారు. కార్మిక హక్కులు, ప్రజాస్వామ్యం , సామాజిక న్యాయాన్ని బలహీనపరిచే విధానాలకు వ్యతిరేకంగా ఐక్యంగా ఉంటామని ప్రతిజ్ఞ చేయడంతో ఈ సమావేశం ముగిసింది.
