అమరావతి : ఏపీలో విస్తృతంగా పెట్టుబడులను ఆకర్షించేందుకు గాను రాష్ట్ర కూటమి ప్రభుత్వం ప్రయత్నం చేస్తోంది. ఇందులో భాగంగా వచ్చే నవంబర్ నెలలో దేశంలోనే ఎక్కడా లేని విధంగా ‘గ్లోబల్ పార్ట్నర్షిప్ సమ్మిట్ ను నిర్వహించనుంది. ఈ విషయాన్ని మంత్రి భరత్ వెల్లడించారు. దీని ప్రమోషన్ కోసం ముంబై, ఢిల్లీ, బెంగళూరు, కోల్కతా, అహ్మదాబాద్ లతో పాటు విదేశాల్లోనూ భారీ రోడ్ షోలు నిర్వహించ బోతున్నారు. అలాగే గిరిజన ప్రాంతాల వరప్రసాదమైన అంతర్జాతీయంగా భౌగోళిక గుర్తింపు పొందిన ‘అరకు కాఫీ’ క్రేజ్ను గ్లోబల్ మార్కెట్లో మరింత అగ్రెసివ్గా వాడుకునేలా చేస్తోంది. గిరిజన రైతులకు గరిష్ట లబ్ధి చేకూర్చేలా దీని ఎంటైర్ వాల్యూ చైన్ను అంతర్జాతీయ బ్రాండింగ్ను సరికొత్త గ్లోబల్ వింగ్ ద్వారా ముందుకు తీసుకెళ్తున్నారు.
గత ప్రభుత్వంలో ఉన్న అధికారులే ఇప్పుడు ఉన్నారని, నాయకుడు మారడం వల్ల రాష్ట్రంలో అభివృద్ధి కనిపిస్తోందన్నారు మంత్రి .కేవలం సీఎం చంద్రబాబు నాయుడు బ్రాండ్ ద్వారా రాష్ట్రం అభివృద్ధిలో దూసుకెళ్తోందన్నారు. గత ప్రభుత్వ పాలనకు కూటమి ప్రభుత్వ పాలనకు మార్పు స్పష్టంగా కనిపిస్తోందన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దేశ విదేశాల్లోని పెట్టుబడిదారుల్లో నమ్మకం కలిగించామన్నారు. ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి కనబరుస్తున్నారన్నారు. పార్టనర్ షిప్ సమ్మిట్లో వచ్చిన పెట్టుబడుల్లో ఇప్పటికే 40 శాతానికి పైగా గ్రౌండింగ్ అవుతున్నాయన్నారు. ప్రతి ఒక్క కంపెనీతో మాట్లాడి వారి ఇబ్బందులు తెలుసుకొని పరిష్కరించే దిశలో ముందుకు వెళుతున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో వచ్చిన పెట్టుబడుల్లో వచ్చిన ఉద్యోగాల జాబితాను ఆధార్కార్డుతో అనుసంధానం చేసే ప్రక్రియ జరుగుతోందని త్వరలో వివరాలు వెల్లడిస్తామని చెప్పారు.
