న్యూఢిల్లీ :కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ సీజేపీ చేపట్టిన ఆందోళనకు మద్దతు తెలిపారు లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ. ఈ సందర్బంగా ఆయనను పోలీసులు అరెస్ట్ చేయడం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఒక ఎంపీని అరెస్ట్ చేయాలంటే ముందుకు లోక్ సభ స్పీకర్ పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. కానీ ఢిల్లీ ఖాకీలు ఎలాంటి ముందస్తు అనుమతి లేకుండానే నిర్బంధించడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది కాంగ్రెస్ పార్టీ. కేంద్రంలో కొలువు తీరిన మోదీ బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం రాచరిక పాలన సాగిస్తోందని ఆరోపించింది. ఇదిలా ఉండగా ప్రధానమంత్రి నివాసం సమీపంలో రాహుల్ గాంధీ, కాంగ్రెస్ ఎంపీలను నిర్బంధించడం పోలీసుల అధికారాలపై ప్రశ్నలను రేకెత్తించింది. పార్లమెంటు వెలుపల స్పీకర్ ముందస్తు అనుమతి అవసరం లేదని, అయితే స్పీకర్కు తప్పనిసరిగా తెలియ జేయాలని ఒక న్యాయ నిపుణుడు పేర్కొన్నారు.
సుప్రీంకోర్టు న్యాయవాది ఆర్.కె. సింగ్ ప్రకారం రాహుల్ గాంధీ అరెస్ట్ కు సంబంధించి స్పందించారు. చట్టం ఎలాంటి వెసులుబాటు కల్పించిందనే దానిపై వివరించారు. శాంతిభద్రతల సమస్య తలెత్తే అవకాశం ఉందని భావిస్తే, పార్లమెంట్ సభ్యులతో సహా ఏ వ్యక్తిని అయినా నిర్బంధించే అధికారం పోలీసులకు ఉందని స్పష్టం చేశారు. తీవ్రమైన క్రిమినల్ లేదా గుర్తించదగిన నేరానికి సంబంధించి ఒక ఎంపీని అరెస్టు చేయడానికి లేదా నిర్బంధించడానికి ముందు, పోలీసులు లోక్సభ స్పీకర్ నుండి ముందస్తు అనుమతి పొందవలసిన అవసరం భారత చట్టంలో లేదని సింగ్ వివరించారు. హత్య, అవినీతి, అల్లర్లు లేదా ఇతర తీవ్రమైన నేరాలు ఈ వర్గం కిందకు వస్తాయని, అందువల్ల స్పీకర్ ఆమోదం కోరకుండానే పోలీసులు చర్యలు తీసుకోవచ్చని పేర్కొన్నారు.
ఈ రక్షణలు పార్లమెంట్ ప్రాంగణానికే పరిమితమని, ప్రాంగణం వెలుపల ఉన్న బహిరంగ ప్రదేశాలకు వర్తించవని సింగ్ స్పష్టం చేశారు. అందువల్ల, విజయ్ చౌక్ లేదా ప్రధానమంత్రి నివాసం సమీపం వంటి ప్రదేశాలతో సహా పార్లమెంట్ వెలుపల నిరసన లేదా పోలీసు చర్య జరిగితే, శాంతిభద్రతల అధికారులు చట్టంలోని సాధారణ నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవచ్చు అని కూడా పేర్కొన్నారు.
