అమరావతి : ఏపీ హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత కీలక వ్యాఖ్యలు చేశారు. దేశం గర్వించ దగిన మానవుడు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అని అన్నారు. అంబేద్కర్ 135వ జయంతి సందర్బంగా ఆయన చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అంబేద్కర్ సిద్ధాంతాలను ప్రజలు తెలుసుకోవాలి, ఆచరించాలని కోరారు. ఆ మహనీయుడి సిద్ధాంతాలతో తెలుగుదేశం పార్టీ పని చేస్తుందన్నారు. నా తెలుగింటి ఆడపడుచు అని ఆప్యాయంగా పిలిచే ఏకైక నాయకుడు అన్న ఎన్టీఆర్ అని కొనియాడారు. ఆ రోజు నుండే మహిళలకు గౌరవం పెరిగిందన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లుతో ఎందరో మహిళా నేతలు తయారవుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా మోదీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
గత ప్రభుత్వంలో ఎస్సీ సబ్ ప్లాన్ నిధులు దుర్వినియోగం చేశారని ఆరోపించారు వంగలపూడి అనిత. ఎన్డీఏ ప్రభుత్వంలో ఎస్సీ సబ్ ప్లాన్ నిధులు దళితువాడల్లో వియోగిస్తున్నాం అని చెప్పారు. 2018లో నర్సీపట్నం నియోజకవర్గంలో పోలీస్ స్టేషనులు శంకుస్థాపనలు చేస్తే, ఇప్పుడు మరల ప్రారంభోత్సవాలు చేసుకున్నామన్నారు హోం శాఖ మంత్రి. ఎన్డీఏ ప్రభుత్వం గంజాయిపై ఉక్కు పాదం మోపుతున్నాం అన్నారు. కొన్నిచోట్ల అమాయక గిరిజనులు గంజాయి రవాణా చేస్తూ, తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్డీపీఎస్ చట్టాన్ని కఠినంగా అమలు చేస్తున్నామని చెప్పారు. రౌడీ మూకలపై ప్రత్యేకంగా దృష్టి సారించి, PD యాక్ట్ ను పెడుతున్నాం అన్నారు. చట్టాలను సమర్థవంతంగా అమలు చేస్తున్నాం అని ప్రకటించారు.
