రాజధాని అమ‌రావ‌తిపై జగన్ ది పూట‌కో మాట

రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత

పెనుకొండ/శ్రీసత్యసాయి జిల్లా : దేశం మొత్తం ఏపీ రాజధాని అమరావతి అని అంటుంటే జగన్ మాత్రం గంటకో మాట మాట్లాడుతున్నాడని ధ్వ‌జ‌మెత్తారు రాష్ట్ర బీసీ, సంక్షేమ శాఖ మంత్రి ఎస్. స‌విత‌. ఒకసారి అమరావతే రాజధాని అంటారు.. మరోసారి మూడు రాజధానులంటారు, ఇంకోసారి మావిగన్ అంటారు… తాను ఉంటున్న లోటస్ పాండ్ ప్యాలెస్ కూడా రాజధానే అని అంటున్నారు… జగన్ కు మంచి వైద్యం అందించాలని స్వయాన వైసీపీ నాయకులు గొణుక్కుంటున్నారంటూ ఎద్దేవా చేశారు . తన పార్టీ ఉనికి కోసమే జగన్ చేస్తున్న వ్యాఖ్యలను ప్రజలు పట్టించు కోవడం లేదన్నారు. శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండ పట్టణంలో పలు అభివృద్ధి పనులకు భూమి పూజతో పాటు రూ.6 లక్షలతో నిర్మించిన ఆంజనేయస్వామి దేవాలయం వద్ద ఘనగిరి పూల మార్కెట్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, పెనుకొండ పట్టణంలో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయన్నారు. పూల వ్యాపారులను ప్రోత్సహించేలా పూల మార్కెట్ ను ఏర్పాటు చేశామన్నారు.

ప్రజలకు మెరుగైన పారిశుధ్య సౌకర్యాలు కల్పించేందుకు రూ.50 లక్షలతో శానిటేషన్ సెంటర్లను నిర్మిస్తున్నామన్నారు మంత్రి స‌విత‌. ఇప్పటికే రూ.5 కోట్లతో చేపట్టిన పనులు త్వరలో పూర్తి కానున్నాయన్నారు. ఎన్టీఆర్ సర్కిల్ నుంచి మడకశిర రోడ్ వరకు కూడా సెంటర్ లైటింగ్ ను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. . గంటకో మాట మార్చే వ్యక్తి జగన్ అని మండిపడ్డారు. దేశం మొత్తం ఏపీ రాజధాని అమరావతి అని అంటుంటే జగన్ మాత్రం పూట‌కో మాట మాట్లాడుతున్నారని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో గతంలో వచ్చిన సీట్లు కూడా రావని వ్యాఖ్యానించారు. గెలిచినప్పుడు ఒకలా, ఓడినప్పుడు మరోలా వ్యవహరించే వ్యక్తి జగన్ అని మంత్రి సవిత విమర్శించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.

Leave A Reply

Your Email Id will not be published!