నూతన హైకోర్టు భవన నిర్మాణానికి సీజేఐ శంకుస్థాపన
పాల్గొన్న రాష్ట్ర ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి
హైదరాబాద్ : భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ చేతుల మీదుగా ఆదివారం రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ లో తెలంగాణ రాష్ట్ర హైకోర్టు జోన్-II భవన నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి సీఎం ఎ. రేవంత్ రెడ్డి తో పాటు పలువురు ప్రముఖులు, న్యాయమూర్తులు పాల్గొన్నారు. తెలంగాణ ప్రస్థానం లో ఈ రోజు ప్రత్యేకం. దేశంలోని అగ్రశ్రేణి న్యాయ మేధావులతో కలిసి ఉన్న ఈ సందర్భం అరుదైన అవకాశం, గౌరవం అని ఈ సందర్బంగా పేర్కొన్నారు సీఎం . ఒక కోర్టు సముదాయం నిర్మించడం, న్యాయం కోసం ఒక ప్రాంగణం సృష్టించడం, కుల మతాలకు అతీతంగా ప్రజల కోసం ఒక పవిత్ర స్థలాన్ని నిర్మించినట్లే తాను భావిస్తానని అన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో పౌరులకు చివరి ఆశ, నమ్మకం న్యాయస్థానం. అటువంటి న్యాయస్థానాన్ని నిర్మించే అవకాశం తమ ప్రభుత్వానికి రావడం అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు.
ఈ కొత్త హైకోర్టు ప్రజాస్వామ్యానికి ఒక ప్రతీకగా నిలబడుతుందని, ఇది న్యాయం కోసం వచ్చే పేదలు, బలహీనులకు భరోసా ఇస్తుందని విశ్వసిస్తున్నానని తెలిపారు సీఎం. ఈ భవన సముదాయాన్ని డిసెంబర్ 2027 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం అని ప్రకటించారు . ఈ కార్యక్రమంలో సుప్రీం కోర్టు న్యాయమూర్తులు జస్టిస్ అలోక్ ఆరాధే, జస్టిస్ ఎస్.వి. భట్టి, జస్టిస్ ఉజ్జల్ భుయాన్, జస్టిస్ పి.ఎస్. నరసింహ, తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామక్రిష్ణారావు, డీజీపీ శివధర్ రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
