హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో జరిగిన మున్సిపల్ ఎన్నికల ఫలితాలలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం సృష్టించింది. మొత్తం 116 మున్సిపాలిటీలలో ఏకంగా కాంగ్రెస్ 90 స్థానాలను కైవసం చేసుకుంది. వ్యూహాలు ఫలించాయి. ప్రధాన ప్రతిపక్ష పార్టీ భారత రాష్ట్ర సమితి పార్టీ కేవలం 12 సీట్లకే పరిమితమైంది. ఇక భారతీయ జనతా పార్టీ నారాయణపేటలో జెండా ఎగుర వేయగా ఎంఐఎం పార్టీ భైంసా మున్సిపాలిటీని కైవసం చేసుకున్నాయి. ఇక 10కి పైగా మున్సిపాలిటీల విషయంలో సందిగ్ధత నెలకొంది. ఇక్కడ ఎవరికీ పూర్తి స్థాయిలో మెజారిటీ దక్కలేదు. ఈ పదింటిలో స్వతంత్ర అభ్యర్థులు కీలక పాత్ర పోషించనున్నారు. దీంతో వీటిని కైవసం చేసుకునేందుకు అధికార పార్టీతో సహా ఇతర పార్టీలు సైతం క్యాంప్ రాజకీయాలకు తెర లేపారు.
అయితే ఇప్పటి వరకు మెజారిటీ మునిసిపాలిటీలలో కాంగ్రెస్ అద్భుత విజయాన్ని నమోదు చేసింది. నేరేడుచర్ల, హుజూర్నగర్, హాలియా, కోదాడ్, నందికొండ, చందూర్, భూత్పూర్, ధర్మపురి, భీమ్గల్, బిచ్కుంద, బాన్స్వాడ, యెల్లారెడ్డి, చొప్పదండి, సుల్తానాబాద్, మంథని, హుస్నాబాద్, మరిపెడ, డోర్నకల్, నారాయణఖేడ్, అశ్వారావుపేట, స్టేషన్ ఘన్పూర్, ఆండోల్-జోగిపేట, సదాశివ్పేట, హుజూరాబాద్, కొల్లాపూర్, మద్దూర్, పెబ్బేరు, మధిరలలో కాంగ్రెస్ విజయాలు సాధించింది. గడ్డపోచారం, ఇంద్రేశం, అయిజ, తొర్రూర్, ఇబ్రహీంపట్నం, తిరుమలగిరిలో భారత రాష్ట్ర సమితి విజయం సాధించింది. వడ్డేపల్లి మున్సిపాలిటీని ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ దక్కించుకుంది. దేవరకద్ర, అలంపూర్, కోహీర్, కేసముద్రం, ఆసిఫాబాద్, అమరచింత, కిఠాన్పల్లి, జనగాం, జిన్నారం, జమ్మికుంట, వేములవాడ, రాయికల్తో సహా పలు మున్సిపాలిటీల్లో హంగ్ ఫలితాలు వచ్చాయి.
