నంద్యాల జిల్లా : మహా శివరాత్రి పర్వదినం సందర్బంగా శ్రీశైలం భక్త భాంధవులతో నిండి పోతోంది. ప్రతి రోజూ వేలాది మంది తరలి వస్తున్నారు తండోప తండాలుగా . ఇప్పటికే రాష్ట్ర సర్కార్, ఆలయ కమిటీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. అయినా చెదురు మదురు సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఈ తరుణంలో ఈనెల 15న మహా శివరాత్రి జరగనుంది. దీనిని దృష్టిలో పెట్టుకుని నంద్యాల ఎస్పీ సునీల్ షారాణ్ ఆధ్వర్యంలో భారీ ఎత్తున భద్రతా ఏర్పాట్లు చేశారు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా వెల్లడించారు శుక్రవారం మీడియాతో. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా ప్రశాంతంగా దర్శనం చేసుకునేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. మ్యాప్ ఆధారంగా బందోబస్తులో చేయవలసిన విధులపై వివరాలు వెల్లడించారు. ఇందు కోసం ప్రత్యేకంగా 1782 మందితో పటిష్టమైన చర్యలు తీసుకున్నామన్నారు ఎస్పీ.
ఈ సందర్భంగా వివిధ జిల్లాల నుండి బందోబస్తు కోసం వచ్చిన ఏఎస్పీలు, డీఎస్పీలతో శ్రీశైలం పోలీస్ స్టేషన్ ఆవరణలో సమావేశం ఏర్పాటు చేశామన్నారు. ఇందుకు సంబంధించి దిశా నిర్దేశం చేశామన్నారు ఎస్పీ. బందోబస్తును 10 సెక్టార్లుగా విభజించడం జరిగిందన్నారు. కర్నూలు, అనంతపురం, అన్నమయ్య, కడప జిల్లాల నుండి సుమారు 1614 మంది సివిల్ పోలీస్ అధికారులు, సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారని చెప్పారు సునీల్ షారాణ్. ఏపీ స్పెషల్ పోలీస్, ఆర్మ్ డ్ రిజర్వు సిబ్బందితో పాటు ఆర్ఎస్ఐలు కూడా ఉన్నారన్నారు. భక్తులతో మర్యాద పూర్వకంగా మాట్లాడి వారికి మార్గ నిర్దేశం చేయాలని స్పష్టం చేశారు ఎస్పీ. లడ్డు కౌంటర్ల వద్ద క్యూలైన్లో భక్తులు స్వామివారి ప్రసాదం స్వీకరించేలా నిరంతరం అప్రమత్తంగా ఉండాలన్నారు.
