అమరావతి : టెక్నాలజీ ద్వారా కీలకమైన పనులన్నీ నెరవేర్చడం మరింత సులభతరంగా మారిందన్నారు సీఎం నారా చంద్రబాబు నాయుడు. పారదర్శక పాలన అందిస్తున్నట్లు తెలిపారు. ఇకపై పాస్బుక్ కోసం అధికారులు చుట్టూ, కార్యాలయాల చుట్టూ ప్రజలు తిరగాల్సిన అవసరం ఉండకూడదని అన్నారు. ఆస్తి అమ్మితే నేరుగా మీ ఇంటికే పాస్ బుక్ వస్తుందన్నారు. ఆటోమ్యుటేషన్ తో పాటు, పాస్ బుక్ కూడా ప్రింట్ చేసి నేరుగా యజమానికి ఇంటికి అధికారులు పంపాలన్నారు. వారసత్వంగా వస్తున్న భూముల విషయంలోనూ సంస్కరణలు తెచ్చాం అని చెప్పారు సీఎం. రూ.10 లక్షల లోపు ఆస్తులకు రూ.100, రూ.10 లక్షల పైబడి ఆస్తులకు రూ.1,000తోనే రిజిస్ట్రేషన్ చేసుకునే విధానం తీసుకు వచ్చామని తెలిపారు. రిజిస్ట్రేషన్ కోసం గంటల తరబడి ఎదురు చూడకుండా స్లాట్ బుకింగ్ విధానం తెచ్చాం అని పేర్కొన్నారు సీఎం.
ప్రభుత్వం కంటిన్యూ అయి ఉంటే ఇలాంటివన్ని ఎప్పుడో అమల్లోకి వచ్చేవన్నారు. కుటుంబ సభ్యులతో ఆస్తి వివాదాల విషయంలో పంతాలకు పోవద్దు. కన్నతల్లిని కోర్టుకు ఈడ్చిన వ్యక్తి ఆదర్శం కాదన్నారు నారా చంద్రబాబు నాయుడు. మధ్యవర్తిత్వం ద్వారా సమస్యలు పరిష్కరించు కోవాలని సూచించారు. పొలం గట్లు దగ్గర ఒక సెంటు కోసం కొట్లాడుకుని పోలీస్ స్టేనషన్ల చుట్టూ తిరుగుతుంటారని, ఇది మంచి పద్దతి కాదన్నారు. కక్షలకు దూరంగా ఉండి గౌరవంగా బ్రతుకుదాం అని పిలుపునిచ్చారు. భూ వివాదాలు ఉండే గ్రామాలను కలెక్టర్లు గుర్తించి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి అని సీఎం చంద్రబాబు సూచించారు.
