విజయవాడ : జగ్గయ్యపేట రాబోయే రోజుల్లో ఏపీకి రోల్ మోడల్ కానుందని అన్నారు విజయవాడ ఎంపీ , ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు కేశినేని చిన్ని. అంతే కాకుండా పారిశ్రామిక కేంద్రంగా మారనుందని చెప్పారు. ఈ రోజు జగ్గయ్యపేట రోడ్డులో విజయ డిజిటల్ సమీపంలో మున్సిపాలిటీ డీఎంఎఫ్టి నిధులు రూ.7.15 కోట్ల వ్యయంతో చేపట్టనున్న రోడ్లు, డ్రైనేజీలు, కల్వర్టులు తదితర అభివృద్ధి పనులకు సంబంధించిన డీఎంఎఫ్టి గ్రాంట్ పైలాన్ శంకుస్థాపన శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య ), కేడీసీసీ బ్యాంకు ఛైర్మన్ నెట్టెం రఘురామ్ , మున్సిపల్ ఛైర్మన్ రంగాపురం రాఘవేంద్ర , ఇతర నాయకులు పాల్గొన్నారు.
జగ్గయ్యపేట రాజధాని అమరావతి ప్రాంతంలో ముఖ్య భాగంగా ఉందన్నారు ఈ సందర్బంగా ఎంపీ కేశినేని చిన్ని.. రానున్న కాలంలో జగ్గయ్యపేట రూపురేఖలు మారి పోవడంతో పాటు పారిశ్రామిక కేంద్రంగా ఎదగ బోతోందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర ప్రణాళికలతో ముందుకు సాగుతోందని చెప్పారు.జగ్గయ్యపేట అభివృద్ధికి 1400 ఎకరాల పారిశ్రామిక స్థలం అవసరం ఉందన్నారు ఎంపీ. ఇందులో డిఫెన్స్ పరిశ్రమల కోసం 1000 ఎకరాలు, జేఆర్డీ టాటా వాటర్ ప్రాజెక్ట్ కోసం 500 ఎకరాలు అవసరమని తెలిపారు. ఇందు కోసం ప్రతిపాదనలు కూడా తయారు చేయడం జరిగిందన్నారు. దీనిపై ఇండస్ట్రియల్ సెక్రటరీతో చర్చలు జరుపుతున్నాం అని తెలిపారు ఎంపీ.
ఇప్పటికే 40 సంవత్సరాల నాటి డంప్ యార్డ్ సమస్యను పరిష్కరించాం అని తెలిపారు. త్వరలోనే మంచినీటి సమస్య పరిష్కారానికి కూడా చర్యలు ప్రారంభిస్తాం అని ప్రకటించారు. జగ్గయ్యపేట పరిధిలో నేషనల్ హైవే, సెకండ్ లైన్ రైల్వే పనులు వేగంగా జరుగుతున్నాయని చెప్పారు ఎంపీ. జగ్గయ్యపేట రైల్వే స్టేషన్కు ప్యాసింజర్ రైళ్లు వచ్చేలా ప్రయత్నం చేస్తున్నామన్నారు. జగ్గయ్యపేట ‘స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీ’గా అప్గ్రేడ్ కావడం ఈ ప్రాంత అభివృద్ధికి పెద్ద అడుగు అని పేర్కొన్నారు. దీని ద్వారా కేంద్ర ప్రభుత్వ అమృత్ నిధులు, 16వ ఆర్థిక సంఘం ఫండ్స్ను పొందే అవకాశం లభించిందన్నారు.
