అమరావతి : ఏపీ సర్కార్ తీపి కబురు చెప్పింది జర్నలిస్టులకు. ఆరోగ్య స్కీంకు సంబంధించి కీలక ప్రకటన చేసింది. సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు మీడియాలో పని చేస్తున్న వారందరికీ గుడ్ న్యూస్ చెప్పింది. వర్కింగ్ జర్నలిస్టు హెల్త్ స్కీమ్ 2026–27 ఆర్థిక సంవత్సరానికి పొడిగిస్తూ వైద్య ఆరోగ్య , కుటుంబ సంక్షేమ శాఖ జీవో యం.యస్ నెం: 43 ను జారీ చేసినట్లు సమాచార పౌర సంబంధాల శాఖ, సంచాలకులు కేఎస్ విశ్వనాథన్ స్పష్టం చేశారు. కావున రాష్ట్ర వ్యాప్తంగా అక్రిడిటేషన్లు అమలులో ఉన్న వర్కింగ్ జర్నలిస్టులందరూ ఈ పథకం ప్రీమియం క్రింద రూ. 1250/- www.cfms.ap.gov.in వెబ్ సైట్ ద్వారా ఈ క్రింద తెలిపిన పద్దుకు చెల్లించి లబ్ధి పొందవలసినదిగా సంచాలకులు కోరారు.
Head of Account: 8342-00-120-01-03-001-001, DDO Code: 2703 0802 003 ద్వారా చెల్లించాలని జర్నలిస్టలకు సూచించారు. ప్రీమియం చెల్లించిన జర్నలిస్టులు ఒరిజినల్ చలానా, కొత్తగా దరఖాస్తు చేసుకునే వారు తమ కుటుంబ సభ్యుల ఆధార్ కార్డులు, ఫొటోలు, JPG ఫార్మాట్ లో సంబంధిత జిరాక్స్ కాపీలను, విజయవాడ పండిట్ నెహ్రూ బస్టాండ్, ఎన్టీఆర్ అడ్మినిస్ట్రేషన్ బ్లాక్ లోని రెండవ ఫ్లోర్ లో ఉన్న సమాచార పౌర సంబంధాల శాఖ, సంచాలకుల కార్యాలయంలోనూ, జిల్లా స్థాయి జర్నలిస్టులు అయితే సంబంధిత జిల్లా కేంద్రాల్లోని సమాచార పౌర సంబంధాల శాఖ కార్యాలయంలో అందజేయాల్సిందిగా సంచాలకులు కేఎస్ విశ్వనాథన్ కోరారు.
వర్కింగ్ జర్నలిస్టు హెల్త్ స్కీం ప్రీమియం రూ.2,500 కాగా ఇందులో జర్నలిస్టు వాటా రూ.1,250, ప్రభుత్వం తన వాటా రూ.1,250 చెల్లిస్తుందన్నారు. జర్నలిస్టు, భార్య/భర్త, పిల్లలు, జర్నలిస్టుపై ఆధారపడిన తల్లిదండ్రులకు ఈ స్కీమ్ వర్తిస్తుందన్నారు.
