హైదరాబాద్ : ఓ వైపు డ్రగ్స్ కేసు ఇంకో వైపు బెదిరింపు, రూ. 10 కోట్ల మోసానికి సంబంధించి పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేసిన తర్వాత తీవ్రంగా స్పందించింది సింగర్ మంగ్లీ. ఆమె మీడియాకు ఓ ప్రకటన విడుదల చేసింది. తనకు ఏ పాపం తెలియదని, తాను అమాయకురాలినని, తనకు ఇంకొకరిని మోసం చేయాల్సిన అవసరం లేదని పేర్కొంది. అయితే ఇండస్ట్రీలో తనకున్న జనాదరణను కొందరు కావాలని క్యాష్ చేసుకోవాలని ప్రయత్నం చేస్తున్నట్లు వాపోయింది. దీనికి తాను ఏం చేయగలనంటూ ప్రశ్నించింది . ఇందులో భాగంగా కొంతమంది వ్యక్తులు పెట్టుబడిదారుల నమ్మకాన్ని పొందడానికి , అధిక రాబడులు ఇస్తామని వాగ్దానం చేసే పథకాన్ని ప్రచారం చేయడానికి తన పేరు తనకు తెలియకుండా వాడుకున్నట్లు ఆవేదన వ్యక్తం చేసింది సింగర్ మంగ్లి.
తాను ఎలాంటి మైక్రో ఫైనాన్స్ మోసానికి పాల్పడలేదని , తాను ఎలాంటి విచారణకైనా సిద్దంగా ఉన్నానని ప్రకటించింది ఈ చిన్నది. అయితే సదరు మోసంతో తనను ముడి పెడుతున్న ఆరోపణలను ఖండించింది. అవన్నీ నిరాధారమైన ఆరోపణలని, అవాస్తవమని, కావాలని తన ప్రతిష్టను దెబ్బ తీయడానికి ఉద్దేశించినవని అన్నారు. అయితే సుబ్బారావు అనే అడ్వకేట్ సంచలన ఆరోపణలు చేశారు మంగ్లీపై. ఆమె సోదరుడు శివ, ఇంకొందరు కలిసి తన వద్ద నుంచి రూ. 10 కోట్లు తీసుకున్నారని ఆరోపించారు. దీనిని ఖండించారు సింగర్ మంగ్లీ. తన గుర్తింపును దుర్వినియోగం చేయడంపై ఆందోళన వ్యక్తం చేశారు.
