న్యూఢిల్లీ : కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు నిప్పులు చెరిగారు. తమిళనాడు రాష్ట్రంలో ఈ ఏడాది జరిగే శాసన సభ ఎన్నికల్లో అన్నాడీఎంకే, బీజేపీ, ఇతర పార్టీలతో కూడిన ఎన్డీయే కూటమి విజయం సాధించక తప్పదని ధీమా వ్యక్తం చేశారు. గురువారం రామ్మోహన్ నాయుడు మీడియాతో మాట్లాడారు. తాజాగా డీఎంకే ఎంపీ దయానిధి మారన్ వ్యాఖ్యలపై సీరియస్ అయ్యారు. బాధ్యత కలిగిన ఎంపీ ఇలా చవకబారు కామెంట్స్ చేస్తే ఎలా అని ప్రశ్నించారు. ఇవన్నీ రాజకీయ ప్రకటనలు. వాస్తవానికి వస్తే, మంచి పనులన్నీ ఎన్డీఏ పాలిత రాష్ట్రాల్లోనే జరుగుతున్నాయని చెప్పారు.
భారతదేశం ప్రపంచ స్థాయిలో నెలకొల్పుతున్న పురోగతి, అభివృద్ధి, ప్రమాణాలన్నీ డబుల్ ఇంజిన్ ప్రభుత్వం ఉన్నప్పుడే సాధ్యమవుతున్నాయని చెప్పారు కింజరాపు రామ్మోహన్ నాయుడు. ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, డబుల్ ఇంజిన్ ప్రభుత్వం ఉన్న ఇతర రాష్ట్రాలను మీరు చూస్తే, అక్కడ గొప్ప అభివృద్ధి జరుగుతోందని అన్నారు కేంద్ర మంత్రి. తమిళనాడు అనేది బీజేపీ చాలా కాలంగా సముచితంగా గౌరవిస్తున్న రాష్ట్రం అని అన్నారు. అక్కడి సంస్కృతి, సంప్రదాయాలు, భాష, సమాజం, అన్నింటినీ గౌరవిస్తున్నారని పేర్కొన్నారు రామ్మోహన్ నాయుడు. ఉత్తర, దక్షిణ, పశ్చిమ, తూర్పు, ఈశాన్య, అన్ని ప్రాంతాలు ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో సముచితంగా గౌరవించ బడుతున్నాయని చెప్పారు. ఆ ఫలితాన్ని మీరు తమిళనాడులో జరగబోయే ఎన్నికలలో చూస్తారని అన్నారు.
