పెనుకొండ/శ్రీసత్యసాయి జిల్లా : సంక్రాంతి పండుగ రోజైనా జగన్ రెడ్డికి బుద్ది రావాలని తాను కోరుకుంటున్నానంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు రాష్ట్ర బీసీ, సంక్షేమ శాఖ మంత్రి ఎస్. సవిత. సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలో కూటమి ప్రభుత్వ పాలనలో ప్రజలు సంక్రాంతి సంబరాలను ఘనంగా జరుపుకుంటున్నారని ఆనందం వ్యక్తంచేశారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని, అమలవుతున్న సంక్షేమాన్ని చూసి జగన్ రెడ్డి ఓర్వలేక పోతున్నారని, ఈ భోగి నుంచైనా ఆయన బుద్ధి మారాలని ఆకాంక్షించారు. పెనుకొండ గవర్నమెంట్ జూనియర్ కళాశాల ఆవరణలో జరిగిన సంక్రాంతి సంబరాల్లో మంత్రి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ సతీష్ కుమార్, ఆర్డీవో ఆనందరావు పాల్గొన్నారు. ఎద్దుల బండ్ల పోటీలు, ముగ్గుల పోటీలను, ఇతర క్రీడలను మంత్రి వీక్షించారు.
ఈ సందర్భంగా తనను కలిసిన విలేకరులతో ఆమె మాట్లాడారు. కుటుంబ సభ్యుల నడుమ సంక్రాంతి సంబరాలను ప్రజలు ఘనంగా జరుపు కోవడం ఆనందంగా ఉందన్నారు ఎస్. సవిత. పంట చేతికొచ్చిన సమయమని, రైతులు ఉత్సాహంతో సంక్రాంతిని జరుపుకుంటున్నారని అన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు సంక్షేమ, అభివృద్ధి పాలనతో ప్రజల మరింత ఆనందంగా ఉన్నారన్నారు. ప్రపంచం మొత్తం ఏపీ వైపు చూస్తోందని చెప్పారు ఎస్. సవిత. సమర్థవంతమైన నాయకత్వంలో ఉన్న ఏపీకి భారీగా పెట్టుబడులు తరలి వస్తున్నాయన్నారు. ప్రజలంతా ఆనందంగా ఉన్నా, ఒకరు మాత్రమే అసూయతో రగిలి పోతున్నారంటూ జగన్ పై ఆమె విమర్శలు గుప్పించారు. కొత్తదనాన్ని ఆహ్వానించడమే భోగి ఉద్దేశమని, ఈ పండగ నుంచైనా జగన్ బుద్ధి మారాలని కోరుకుంటున్నట్లు మంత్రి సవిత అన్నారు. అంతకు ముందు మంత్రి సవిత సంక్రాంతి సంబరాల్లో పాల్గొనడానికి క్యాంపు కార్యాలయం నుంచి జూనియర్ కళాశాల వరకూ ఎద్దుల బండిలో భారీ ర్యాలీగా వచ్చారు.
