ముంబై : రిటైర్డ్ నేవీ ఆఫీసర్ అశోక్ ఖారత్ సెక్స్ స్కాండల్ మహారాష్ట్ర సర్కార్ ను కుదిపేస్తోంది. ఈ స్కాంలో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్నారు రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ రూపాలీ చకన్కర్. తీవ్ర ఆరోపణలు , విమర్శలు రావడంతో ఒత్తిళ్ల మధ్య ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ న పదవికి రాజీనామా చేయాలని ఆదేశించారు. దీంతో గత్యంతరం లేక తన చైర్ పర్సన్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఇదిలా ఉండగా అశోక్ ఖారత్ కేసును ఎన్సీపీ నేత ప్రపుల్ పటేల్ అత్యంత తీవ్రమైన, అసహ్యకరమైన ఘటనగా పేర్కొన్నారు. ఇందులో దోషులుగా తేలిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రకటించారు.
నాసిక్ కేంద్రంగా రిటైర్డ్ నేవీ ఆఫీసర్ అశోక్ ఖారత్ తనకు తానుగా స్వయం ప్రకటిత గురువుగా ప్రకటించుకున్నారు. తనపై వచ్చిన లైంగిక దాడి ఆరోపణలపై ఒక ప్రత్యేక దర్యాప్తు బృందం ఇప్పటికే విచారణ జరుపుతోంది; కాగా, ఖరత్ నడుపుతున్న ట్రస్ట్లో చకన్కర్ ఒక ట్రస్టీగా వ్యవహరించారు. రూపాలి చకన్కర్ పార్టీ అధ్యక్షురాలు సునేత్ర పవార్ను కలిశారు. నాసిక్లో లైంగిక దాడి, అత్యాచారం ఆరోపణలపై అశోక్ ఖరత్ అరెస్టు కావడం కలకలం రేపింది. అలాగే ఆయనతో చకన్కర్కు ఉన్న సన్నిహిత సంబంధాలను తెలిపే ఫోటోలు వెలుగులోకి రావడం చర్చనీయాంశంగా మారింది.
రూపాలీ చకన్కర్ అంతకు ముందు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ సదానంద్ డేట్ను కలిశారు. ఆ తర్వాత, ఖరత్ కేసులో కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆమె ఒక లేఖను విడుదల చేశారు. ఇందులో ఈ కేసుపై సమగ్రమైన, కాలపరిమితితో కూడిన ,నిష్పక్షపాత విచారణ జరపాలని కమిషన్ పోలీసులను ఆదేశించింది. ఈ దర్యాప్తును కమిషన్ నిశితంగా పర్యవేక్షిస్తుందని ఆమె పేర్కొన్నారు.
