అమరావతి : మత్స్యకారుల సంక్షేమం, వారి కుటుంబాల భద్రత కోసం నిజంగా పని చేసింది కూటమి ప్రభుత్వమేనని రాష్ట్ర వ్యవసాయ, మత్స్యశాఖల మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. గత ఐదేళ్లలో మత్స్యకారులను మాటలతో మభ్యపెట్టి వారి హక్కులను కాలరాసింది జగన్ ప్రభుత్వం అని ఆయన తీవ్రంగా మండిపడ్డారు. మత్స్యకారుల జీవనోపాధిని బలోపేతం చేయడంలో కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుందని తెలిపారు.జువ్వలదిన్నె హర్బర్ వద్ద నిస్సిగ్గుగా జగన్ పచ్చి అబద్దాలు మాట్లాడారంటూ మండిపడ్డారు మంత్రి . ఫిషింగ్ హార్బర్ల నిర్మాణానికి గత ప్రభుత్వంలో కేంద్రం వాటా అయిన 128 కోట్లను ఉపయోగించకుండా నిధులను పక్కదారి పట్టించారని ఆరోపించారు. రాష్ట్ర వాటా కూడా మత్స్యకారుల కోసం ఉపయోగించకుండా ఇష్టానుసారంగా వ్యవహరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక కేంద్రం వాటా నిధులను వెంటనే కట్టాలని కేంద్రం రాష్ట్రానికి లేఖ రాసిందని, లేకపోతే ఇతర సబ్సిడీలు అమలు చేసేది లేదంటూ చెప్పటంతో వెంటనే 128 కోట్ల బకాయిలను విడుదల చేశామన్నారు అచ్చెన్నాయుడు.
ఇవాళ జగన్ నోటికి వచ్చిన అబద్ధాలు మాట్లాడుతూ ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారని అన్నారు. వేట నిషేధ కాలంలో ఇచ్చే భృతిని రూ.10,000 నుండి రూ.20,000కు పెంచి, లక్షలాది కుటుంబాలకు నేరుగా ఆర్థిక భరోసా కల్పించామని చెప్పారు. ఒకే సంవత్సరంలో భారీగా రూ.242 కోట్లకు పైగా సహాయం అందించడం కూటమి ప్రభుత్వ నిబద్ధతకు నిదర్శనమని పేర్కొన్నారు. మత్స్యకారుల ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు డీజిల్ సబ్సిడీ పథకాన్ని సమర్థవంతంగా అమలు చేస్తున్నామని, వేలాది పడవలకు లీటరుకు రూ.9 సబ్సిడీ అందిస్తున్నామని వెల్లడించారు. గత ప్రభుత్వం ఐదేళ్లలో ఇచ్చిన సబ్సిడీ కంటే మెరుగైన సహాయం తాము అందిస్తున్నామని పేర్కొన్నారు.
